భయం గుప్పిట్లో దిబ్బలపాలెం

5 May, 2020 13:03 IST|Sakshi
నిత్యం కళకళలాడే దిబ్బలపాలెం నిర్మానుష్యంగా మారిన దృశ్యం

7 కరోనా పాజిటివ్‌ కేసులతో వణుకు

పరీక్షలు చేయించుకునేందుకు జనం ఆసక్తి

డాబాగార్డెన్స్‌(విశాఖ దక్షిణ): నిత్యం కళకళలాడే దిబ్బలపాలెం ఒక్కసారిగా బోసిపోయింది. జగదాంబ జంక్షన్‌కు కూతవేటు దూరంలో ఉన్న దిబ్బలపాలెం, చందకవీధి, దండుబజార్, పీ అండ్‌ టీ క్వార్టర్స్, భుజంగరావుపేట, రామాలయం వీధి తదితర ప్రాంతాలు కరోనా వైరస్‌ కారణంగా మూగబోయాయి. గత శుక్రవారం దిబ్బలపాలెంలో ఒకే ఇంట్లో మూడు పాజిటివ్‌ కేసులు నమోదైన రోజు నుంచే ఆయా ప్రాంతాల వాసులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఆదివారం ఇదే ప్రాంతంలో మరో 4 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో ఆయా ప్రాంతాల ప్రజలు భీతిల్లిపోతున్నారు. ఎప్పుడు ఏ విషయం వినాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. ఆదివారం 53 మంది, సోమవారం 70 మందికి అధికారులు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ ఫలితాలు ఇంకా రావాల్సి ఉండడంతో అంతా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. స్థానికంగా ఉన్న పలువురు కరోనా పరీక్షలు చేయించుకోవడానికి ముందుకు వస్తున్నారు. దండుబజార్‌ సమీపంలోని వార్డు కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న పరీక్షల కోసం స్థానికులు ఉదయం నుంచే క్యూ కడతున్నారు.

దారులన్నీ బంద్‌
పోలీసులు అప్రమత్తమై దిబ్బలపాలెంలో ఎక్కడికక్కడ బారీకేడ్లు ఏర్పాటు చేశారు. జగదాంబ జంక్షన్‌ ఓ ఆప్టెక్స్‌ వద్ద చెక్‌పోస్టు పెట్టారు. సెయింట్‌ ఆంథోనీ పాఠశాల నుంచి జగదాంబ జంక్షన్‌ వరకు.. అలాగే జగదాంబ జంక్షన్‌ నుంచి కేజీహెచ్, కలెక్టరేట్‌ వరకు ఉన్న దారులన్నీ బంద్‌ చేశారు. ఎవరూ బయట తిరగకుండా హెచ్చరికలు చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో పారిశుద్ధ్య సిబ్బంది బ్లీచింగ్‌ చల్లారు. రసాయన ద్రావణం పిచికారీ చేశారు.  

మరిన్ని వార్తలు