విప్ ధిక్కరించారో...

7 Jun, 2014 02:15 IST|Sakshi

ఎల్.ఎన్.పేట, న్యూస్‌లైన్: జిల్లా, మండల పరిషత్ పాలకవర్గ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్‌లతో పాటు మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష, కో-అప్షన్ సభ్యుల ఎన్నికకు సంబంధించిన నిబంధనలు ఇప్పటికే జారీ చేసింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జిల్లా, మండల పరిషత్ కార్యాలయాలకు ఎన్నికల కమిషన్ నుంచి అందాయి.
 
 మరో వారం రోజుల్లో పాలక వర్గాలను ఎన్నుకునేందుకు నోటిఫికేషన్ జారీ చేసేందుకు అధికార యంత్రాంగం రంగం సిద్ధం చేస్తోంది. ఎన్నికల ప్రక్రియ పూర్తికావడం, ఫలితాలు వెలువడడం, పాలకవర్గం ఎంపిక వంటి ప్రక్రియలు ఆలస్యంగానే జరుగుతున్నాయి. ఈనెల 8న రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం పూర్తయిన తరువాత మరో మూడు నాలుగు రోజుల్లో జిల్లా, మండల పరిషత్‌ల ఎన్నికలు కూడా పూర్తిచేసే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెపుతున్నారు.
 
జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఇలా...

* సెక్షన్ 17 (3) (వీ)ప్రకారం మండల పరిషత్‌కు ఇద్దరు మైనార్టీ సభ్యులను కో-అప్షన్ సభ్యులుగా ఎన్నుకోవచ్చు. 21 ఏళ్లు నిండిన జిల్లాలో ఓటు హక్కు కలిగిన వారు అర్హులు.

*సెక్షన్(171) (1) ప్రకారం జెడ్పీ చైర్మన్‌ను జిల్లా పరిషత్ (జెడ్పీటీసీ) సభ్యులు చేతులు ఎత్తి ఎన్నుకోవాలి. ఇక్కడ కూడా గుర్తింపు పొందిన పార్టీలు జారీ చేసిన విప్ మేరకే నడుచుకోవాలి. విప్ దిక్కరిస్తే జెడ్పీటీసీ సభ్యత్వం రద్దుచేసే అవకాశం ఆయా పార్టీలకు ఉంది.

* జిల్లా పరిషత్, మండల పరిషత్ చైర్మన్, అధ్యక్షులను ఎన్నుకునేందుకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులతోపాటు కో-ఆప్షన్ సభ్యులే అర్హులు.

* ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఓటు హక్కులేదు. వారు ఆయా సమావేశాలకు హాజరైతే కూర్చోనేందుకు ప్రత్యేక స్థానాలు కేటాయించాల్సి ఉంటుంది.

* సమావేశ భవనం ఎలాంటి ప్రచారాలకు ఇవ్వకూడదు. సభ్యులను ఎలాంటి ప్రలోభాలకు గురిచేయకూడదు.

*ఏవేని కారణాలతో కో-ఆప్షన్ సభ్యుని ఎన్నిక జరగకపోతే ఆ సమాచారాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు తెలియజేయాలి.

*ఈఎన్నికకు సంబంధించి ప్రత్యేక సమావేశంలో ఎన్నికైన సభ్యుల్లో రెండింట మూడోవంతు కోరం తప్పనిసరిగా ఉండాలి. దీనికోసం గంట సమయాన్ని కేటాయిస్తారు. అప్పటికీ కోరం లేకపోతే మరుసటి రోజుకు సమావేశాన్ని వాయిదా వేస్తారు. ఆరోజు కూడా పరిస్థితిలో మార్పురాకపోతే విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లాలి. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నిక నిర్వహిస్తారు.
 ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నిక ఇలా...

*పంచాయతీ రాజ్ చట్టం 1994, సెక్షన్ 149 (1) (వీ)ప్రకారం ప్రతి మండలానికి ఒక మైనార్టీని కో-ఆప్షన్ సభ్యునిగా ఎన్నుకోవాలి. కో-ఆప్షన్ సభ్యునిగా ఎన్నుకునే వ్యక్తికి 21 ఏళ్లు నిండి ఆదే మండలంలో ఓటు హక్కు కలిగి ఉండాలి.

*సెక్షన్ 153 (1)ప్రకారం మండలంలో అధ్యక్ష, ఉపాధ్యక్షుల్ని సభ్యులు చేతులెత్తే పద్దతిలో ఎన్నుకోవాలి. గుర్తింపు పొందిన పార్టీలు జారీ చేసిన విప్ మేరకే అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. విప్‌ను దిక్కరించిన వారి సభ్యత్వాన్ని రద్దుచేసే అధికారం ఆయా పార్టీలకు ఉంటుంది.

మరిన్ని వార్తలు