‘మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు చేయాల్సిందే’

25 Jan, 2016 19:49 IST|Sakshi

- కృష్ణాడెల్టా పరిరక్షణ, రైతు సంఘాల ప్రతినిధుల డిమాండ్
- అభ్యంతరాల పత్రం తయారు చేసి సీఆర్‌డీఏకు అందజేత


విజయవాడ : రాజధాని మాస్టర్‌ప్లాన్‌లో ప్రజోపయోగమైన మార్పులు చేయాల్సిందేనని కృష్ణాడెల్టా పరిరక్షణ సమితితోపాటు వివిధ రైతు సంఘాల ప్రతినిధులు డిమాండు చేశారు. ఆంగ్లంలో ఉన్న మాస్టర్‌ప్లాన్‌ను చదవడంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, అర్థం కాని ఆంగ్ల ప్రతిని రైతుల ముందుంచి అభ్యంతరాలు చెప్పమనడం సహేతుకం కాదని వీరు అభిప్రాయపడ్డారు.

కృష్ణాడెల్టా పరిరక్షణ సమితి కన్వీనర్ కొలనుకొండ శివాజీ, వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి, ఏపీ రైతాంగ సమాఖ్య అధ్యక్షుడు యెర్నేని నాగేంద్రనాథ్, భారతీయ కిషాన్ సంఘ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి కుమారస్వామి, రాజధాని ప్రాంత రైతు సంఘాల సమాఖ్య కన్వీనర్ మల్లెల శేషగిరిరావు, అనుమోలు గాంధీలు సంతకాలు చేసిన అభ్యంతరాల పత్రాన్ని కొలనుకొండ సోమవారం సీఆర్‌డీఏ అధికారులకు అందజేశారు.

రైతులు, ప్రజాభిప్రాయాలకు అనుగుణంగా మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు చేయాలనీ, మార్చిలో జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మాస్టర్‌ప్లాన్‌పై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. బలవంతపు భూ సేకరణను నిలిపివేసి అసైన్డ్, గ్రామకంఠాల సమస్యలను పరిష్కరించాలని కోరారు. హైవేల పేరుతో గ్రామాల తొలగింపు యోచనను విరమించుకోవాలనీ, ప్రజలందరికీ అర్థమయ్యేలా మాస్టర్‌ప్లాన్ కాపీలను తెలుగులో ముద్రించి అందజేయాలని వినతిపత్రంలో కోరారు.

మరిన్ని వార్తలు