కేకే లైన్‌కు గ్రీన్‌సిగ్నల్

11 Nov, 2014 00:53 IST|Sakshi

అరుకు వెళ్లేందుకు ఇక రోజూ రైలు
పర్యాటకుల్లో ఉత్సాహం

 
విశాఖపట్నం సిటీ: కొత్తవలస-కిరండూల్(కేకే) రైల్వే మార్గంలో రైళ్ల రాకపోకలకు తూర్పు కోస్తా రైల్వే అధికారులు సోమవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హుద్‌హుద్ ధాటికి ఈ మార్గంలోని బొడ్డవర-గోరాపూర్ స్టేషన్ల మధ్య 45 ప్రాంతాల్లో ట్రాక్‌పై కొండచరియలు, భారీ వృక్షాలు విరిగి పడ్డాయి. బ్రిడ్జిలు పడిపోయాయి. టైడా-చిమిడిపల్లి మధ్య ఉన్న 24 మీటర్ల పొడవైన బ్రిడ్జి దిమ్మ(పిల్లర్లు కాంక్రీట్‌తో నిర్మించిన దిమ్మ) కొట్టుకుపోయింది.

దీంతో సుమారు నెల రోజులపాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. రైల్వే బోర్డు ఉన్నతాధికారులు, ఆర్డీఎస్‌వో లక్నో అధికారులు, తూర్పుకోస్తా రైల్వే చీఫ్ బ్రిడ్జి ఇంజినీర్ విపి శ్రీవాస్తవ ఈ బ్రిడ్జి నిర్మాణానికి తీవ్రంగా శ్రమించారు. 120 టన్నుల బ్రేక్ డౌన్ క్రేన్ సాయంతో అహ్మదాబాద్ నుంచి తీసుకొచ్చి 24 మీటర్ల బ్రిడ్జి  దిమ్మను నిర్మించారు. ఇలా అనుకున్న సమయానికన్నా రెండు రోజుల ముందుగానే తూర్పు కోస్తా అధికారులు రైలును పట్టాలెక్కించారు.

ఈ నెల 9వ తేదీరాత్రి 8.30 గంటల ప్రాంతంలో గూడ్సు రైలును నడిపి ట్రాక్ ఫిట్‌ను పరీక్షించారు. ట్రాక్ ఫిట్ కావడంతో విశాఖ నుంచి కిరండూల్ వెళ్లే 1వీకే ప్యాసింజర్‌ను మంగళవారం నుంచి రోజూ ఉదయం 6.45 గంటలకు బయల్దేరుతుంది. ఈ రైలు జగదల్‌పూర్ వర కే నడుపుతున్నారు. తిరిగి జగదల్‌పూర్ నుంచి విశాఖకు బుధవారం నుంచీ రోజూ నడుస్తుందని రైల్వే సీనియర్ డివిజనల్‌కమర్షియల్ మేనేజర్ ఎం. ఎల్వేందర్ యాదవ్ సోమవారం రాత్రి విలేకరులకు తెలిపారు.  

మరిన్ని వార్తలు