హజ్‌యాత్ర విమాన షెడ్యూల్‌ ఖరారు

22 Jul, 2019 03:22 IST|Sakshi

పది గంటల ముందు నాంపల్లి హజ్‌హౌస్‌కు చేరుకోవాలి

జూలై 31, ఆగస్టు 1, 2, 3 తేదీల్లో హైదరాబాద్‌ నుంచి జెద్దా బయలుదేరనున్న విమానాలు

సాక్షి, అమరావతి: 2019 హజ్‌ యాత్ర విమాన షెడ్యూల్‌ ఖరారైంది. టెక్నాలజీని ఉపయోగించుకొని తక్కువ సమయంలో కావాల్సిన పనులు చేసుకోవచ్చని డిప్యూటీ సీఎం, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అంజద్‌బాషా హజ్‌ యాత్రికులకు మరోసారి విజ్ఞప్తి చేశారు. ఏ విమానంలో ఏ తేదీన ప్రయాణం చేయనున్నారో ఆ సమాచారాన్ని హజ్‌ కమిటీ ఆఫ్‌ ఇండియా హజ్‌ యాత్రికులు దరఖాస్తులో పేర్కొన్న ఫోన్‌ నంబర్‌కు మెసేజ్‌ చేస్తుంది. మెసేజ్‌ వచ్చిన వెంటనే హజ్‌ యాత్రికులు తమ సెల్‌ఫోన్‌ ద్వారా ఆన్‌లైన్‌లో విమాన బుకింగ్‌ నిర్ధారణ చేసుకోవాలి. అర్థం కాకపోతే సమీపంలో ఉన్న ఇంటర్‌నెట్‌ సెంటర్‌కు వెళ్లి చేసుకోవచ్చు. లేదా జిల్లా హజ్‌ సొసైటీల సాయం తీసుకోవాలని ఏపీ స్టేట్‌ హజ్‌ కమిటీ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ తాజుద్దీన్‌ ఆరీఫ్‌ హజ్‌ యాత్రికులకు సూచించారు. ఆన్‌లైన్‌ విమాన బుకింగ్‌ను నిర్ధారణ చేసుకోవడం వల్ల తమ ప్రయాణానికి 48 గంటల ముందే నాంపల్లి హజ్‌హౌస్‌కు వెళ్లాల్సిన అవసరం ఉండదు. కేవలం 10 గంటల ముందు వెళ్తే సరిపోతుంది. 

- ఆంధ్రప్రదేశ్‌ యాత్రికులు వెళ్లే మొదటి విమానం ఎయిర్‌ ఇండియాకు చెందిన ఏఐ–5375 జూలై 31న మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌ విమానాశ్రయం నుంచి జెద్దా బయలు దేరనుంది. ఈ విమానంలో గుంటూరుకు చెందిన 207 మంది, కృష్ణా జిల్లాకు చెందిన 113 మంది, విశాఖపట్నం ఇద్దరు, పశ్చిమగోదావరికి వాసులు 20 మంది కలిపి మొత్తం 342 మంది వెళ్లనున్నారు. 
ఆగస్టు 1న మధ్యాహ్నం 12:45 గంటలకు ఎయిర్‌ ఇండియాకు చెందిన ఏఐ–5383 విమానంలో 343 మంది యాత్రికులతో హైదరాబాద్‌ విమానాశ్రయం నుంచి జెద్దా బయలుదేరనుంది. ఈ విమానంలో తూర్పుగోదావరి నుంచి నలుగురు, గుంటూరు జిల్లాకు చెందిన 85 మంది, కృష్ణ్లాకు చెందిన 75 మంది, కర్నూలు 111, నెల్లూరు 19, ప్రకాశం 10, విశాఖపట్నం 23, విజయనగరం జిల్లాకు చెందిన 16 మంది ప్రయాణికులు వెళ్తారు.
ఆగస్టు 2న మధ్యాహ్నం 12:55 గంటలకు ఎయిర్‌ ఇండియాకు చెందిన ఏఐ–5391 విమానంలో కర్నూలు జిల్లాకు చెందిన 268 మంది యాత్రికులు హైదరాబాద్‌ విమానాశ్రయం నుంచి జెద్దా వెళ్తారు.
ఆగస్టు 3న మధ్యాహ్నం 12:55 నిమిషాలకు ఎయిర్‌ ఇండియాకు చెందిన ఏఐ–5403 విమానంలో తూర్పుగోదావరికి చెందిన 28 మంది, కడపకు చెందిన 199 మంది, కర్నూలు 31, నెల్లూరు ఐదుగురు, శ్రీకాకుళం నలుగురు, విశాఖపట్నం 55, విజయనగరం నలుగురు, పశ్చిమగోదావరికి చెందిన 17 మంది.. మొత్తం 343 మంది హజ్‌ యాత్రకు వెళ్తారు.
ఆగస్టు 3న మధ్యాహ్నం 12:55 గంటలకు ఎయిర్‌ ఇండియా విమానం ఏఐ–5397లో హైదరాబాద్‌ నుంచి ఆరుగురు, కడప 11, కృష్ణా జిల్లాకు చెందిన ఐదుగురు, కర్నూలు 10, నెల్లూరు 64, ప్రకాశం 26, కర్ణాటక రాష్ట్రంలోని బీదర్‌కు చెందిన 163 మంది, కలబుర్గీ 20, రాయచూర్‌ 5, యాదగిరికి చెందిన 31 మంది.. మొత్తం 341 మంది హజ్‌ యాత్రకు ఈ విమానంలో వెళ్లనున్నారు. 

>
మరిన్ని వార్తలు