పాడి రైతులకు జిల్లా పశు సంవర్థక శాఖ ప్రోత్సాహకాలు

13 Dec, 2013 01:56 IST|Sakshi

గుడ్లవల్లేరు, న్యూస్‌లైన్ : జిల్లాలో తరిగిపోతున్న పెయ్యి దూడలను వృద్ధి చేసేందుకు ఆ దూడల్ని పెంచుతున్న పాడి రైతులకు జిల్లా పశు సంవర్థక శాఖ ప్రోత్సాహకాలు  అందిస్తోంది. ‘సునందిని’ పథకం ద్వారా ఈ దూడల్ని అభివృద్ధి చేస్తున్నారు.  9వేల పెయ్యి దూడల్ని జిల్లాలో వృద్ధి చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం రూ.3,62,25,000 నిధుల్ని  ఈ శాఖ కేటాయించింది. చిన్న, సన్నకారు రైతులకు ఈ పథకం బాగా వర్తింపజేసేందుకు రూపకల్పన చేస్తున్నారు.

ఒక్కో రైతు రెండేసి దూడలకు ఈ ప్రోత్సాహకాలు తీసుకునేలా అవకాశం కల్పించారు. రైతు ఇంట గేద లేక ఆవుకు ఈనికలో వచ్చిన 3-4నెలల వయసున్న పెయ్యిదూడను స్థానిక వెటర్నరీ వైద్యాధికారి నిర్ధారిస్తారు. అలాంటి దూడకు సంబంధించిన యూనిట్ ధర రూ.5వేలు ఉంది. గేద లేక ఆవు పెయ్యి దూడ ఒక్కో దూడకు చెందిన పాడిరైతు తన వాటాగా రూ.975  చెల్లించాలి. పశు సంవర్థక శాఖ తన వాటాగా 4,025 ఇస్తోంది. దూడ దాణాకే రూ.4,100 కేటాయించారు. నెలనెలా డీవార్మింగ్‌కు రూ.300  కేటాయిస్తారు.
 
దూడకు బీమా పాడి రైతుకు ధీమా...

 లబ్ధిదారుడు చెల్లించిన రూ.975లో ఒక్కోదూడకు  రూ.600 బీమా ప్రీమియంకే చెల్లిస్తారు. రెండేళ్ల వరకూ ఈ బీమా దూడకు పనిచేస్తుంది. ప్రీమియం చెల్లించిన తొలి 15రోజుల వరకూ బీమా వర్తించదు. ఆరు నెలల దూడ చనిపోతే రూ.5వేలు, ఏడాదికి రూ.10వేలు, ఏడాదిన్నరకు రూ.15వేలు, రెండేళ్లకు రూ.20వేల చొప్పున బీమా ఇస్తారు.
 

మరిన్ని వార్తలు