పేదల పాలిట అపూర్వ పథకం

8 Nov, 2023 04:59 IST|Sakshi

అభిప్రాయం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ శిబిరాలలో ఈనెల  5వ తేదీ వరకు 85 వేలమంది పేషెంట్లను మెరుగైన చికిత్స కోసం నెట్‌వర్క్‌ ఆస్పత్రి, టీచింగ్‌ ఆస్ప త్రులకు వైద్యులు రిఫర్‌ చేశారు. పెద్ద పెద్ద కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో, పట్టణాలలో మాత్రమే లభ్యమయ్యే వైద్య సేవలు, ఈ శిబిరాలనిర్వహణ వల్ల పేద, మధ్యతరగతి గ్రామీణులకు కూడా అందుబాటులోకి రావడం ముదావహం. 

ఖరీదైన వైద్యం చేయించుకోలేని నిస్సహాయ స్థితిలో వున్న వారికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రవేశపెట్టిన ఈ ‘జగనన్న ఆరోగ్య సురక్ష‘ కింద నిర్వహిస్తున్న వైద్య శిబిరాలు సాధారణ వైద్య శిబిరాలు కావు. పేషెంట్ల జబ్బు నయం అయ్యేదాకా పూర్తిస్థాయిలో చేయూత నివ్వడమే వీటి లక్ష్యం.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముఖ్యమైన ఆరోగ్య సంబంధిత పథకాల్లో ఈ సురక్ష పథకం ఒకటి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 10,032 గ్రామ సచివాలయాల్లో దాదాపు 98 శాతం, వార్డు సచివాలయాల్లో 77 శాతం శిబిరాల నిర్వహణ పూర్తయ్యింది. బృహత్తరమైన ఈ కార్యక్రమంలో ప్రతి ఇంటికీ వెళ్లి కుంటుంబ సభ్యులు అందరికీ పరీక్షలు నిర్వహించటం మొదటి అడుగు. పట్టణ ప్రాంతాల్లో   91 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో  94 శాతం స్క్రీనింగ్‌ ఇప్పటికే పూర్తయ్యింది. మరో వారంలో నూరు శాతం పూర్తి అవుతుందని ప్రభుత్వ గణాంకాలు తెలియ చేస్తున్నాయి.

రాష్ట్ర స్థాయిలో ఇప్పటివరకు స్క్రీనింగ్‌ జరిగిన 1.44 కోట్ల కుటుంబాల్లోని వారికి  6.4 కోట్ల ర్యాపిడ్‌ పరీక్షలు నిర్వహించటం కని విని ఎరుగని విషయం. ఇలా స్క్రీనింగ్‌ చేసిన వారిని మొబైల్‌ యాప్‌ ద్వారా ట్రాక్‌చేసి, వారిని ఆయా ఆస్పత్రులకు మ్యాప్‌ చేస్తారు. ఆ తర్వాత విలేజ్‌ క్లినిక్‌కు, ఫ్యామిలీ డాక్టర్‌కు, గ్రామ సచివా లయంలోని వైద్య ఆరోగ్య సిబ్బందితో అనుసంధానం చేయించి, వారి ద్వారా రోగులకు నయం అయ్యేంతవరకూ తగిన విధంగా సహాయ చర్యలు తీసుకొంటారు.

ఇప్పటికే వేలాది మందిని మెరుగైన వైద్యం కోసం రిఫరల్‌ ఆస్పత్రులకు పంపిన ప్రభుత్వం మిగిలిన వారిని కూడా ఆస్పత్రులకు పంపించడానికి తగిన చర్యలు తీసుకొంటోంది. వారికి కావాల్సిన మందులు ఉచితంగా ఇవ్వటంతోపాటు ఆరోగ్యం బాగయ్యే వరకూ తగిన విధంగా వారికి ప్రభుత్వం చేయూత ఇస్తోంది.

పేదలపాలిట ‘సంజీవని’గా ఉన్న ఈ పథకం ఇప్పటికే అందరి మన్ననలూ పొందుతోంది. కొన్ని నెట్‌వర్క్, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో జరుగు తున్న మెడికల్‌ మాఫియా అక్రమాలు అరికట్టేందుకు   మెడికల్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందాలను ప్రభుత్వం నియమించింది. దీంతో అక్రమాలకు పాల్పడుతున్న ఆస్పత్రులకు  చెక్‌ పెట్టడం సాధ్యమ య్యింది.  

ఈ విధంగా జగన్‌ ప్రభుత్వం సాధారణ ప్రజానీకం ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధతో వైద్యాన్ని అందించడంతో ‘ఆరోగ్యాంధ్రపదేశ్‌’ సాకారానికి దారి ఏర్పడింది. ప్రజలు వైద్యానికి అయ్యే ఖర్చులు మిగుల్చుకొని పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవడానికి ఆ డబ్బును ఉపయోగించుకొనే అవకాశం ఏర్పడింది. అందుకే జనం జగన్‌ పాలన మళ్లీ రావాలని కోరుకొంటున్నారు.

చలాది పూర్ణచంద్ర రావు 
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌
మొబైల్‌ : 94915 45699

మరిన్ని వార్తలు