శాంతిభద్రతలను పరిరక్షిస్తాం

1 Jan, 2014 06:27 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు చేపట్టామని జిల్లా ఎస్పీ డాక్టర్ తరుణ్‌జోషి పేర్కొన్నారు. 2013లో నమోదైన కేసుల సంఖ్య 32.5 శాతం పెరిగిందని ఆయన ప్రకటించారు. నూతన సంవత్సరంలో శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు చేపడతామన్నారు. ఇందుకు ప్రజల సహకరించాలని కోరారు. నేరా లు, కేసుల నమోదు, దర్యాప్తు తదితర 43 అంశాలతో కూడిన 2013-నివేదికను మంగళవారం విడుదల చేశారు.  ఇందులోని ముఖ్యమైన అంశాలను పరిశీలిస్తే..
 
 2012 సంవత్సరంలో జిల్లాలో 6326 కేసులు  నమోదు కాగా ఈ ఏడాది వీటి సంఖ్య 7349కి పెరిగిందన్నారు.
 
 2013లో జిల్లా పోలీసులు మూడు దొంగల ముఠాలను అరెస్టు చేసి రూ. 21.17 లక్షల విలువ చేసే ఆస్తులను రికవరీ చేశామని చెప్పారు.
 
 రాష్ట్ర పోలీస్‌శాఖ ప్రతిష్టాత్మకంగా  చేపట్టిన  డయల్ 100కు మొత్తం 19,654 ఫోన్ కాల్స్ వచ్చాయని, ఇందులో 1,507 పేకాల్స్ ఉన్నాయని  వివరించారు.
 
 వీధిబాలల పునరావాస చర్యల్లో భాగంగా 175 మంది చిన్నారులను గుర్తించామని, ఇందులో 107 మంది పిల్లలను వారి తల్లిదండ్రులకు అప్పగించగా, మిగిలిన 68 మందిని బాలల పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు.
 
 కుటుంబ తగాదాల పరిష్కారం కోసం జిల్లా లో నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, బాన్సువాడల్లో ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్లను నిర్వహించామని ఎస్పీ తెలిపారు. ఇందులో 859 ఫిర్యాదులు రాగా 704 ఫిర్యాదులు పరి ష్కారమయ్యాయని, మిగిలిన 116 ఫిర్యాదులపై కేసులు నమోదు చేశామన్నారు.
 
 జిల్లా వ్యాప్తంగా  2013లో నమోదైన కేసుల కు సంబంధించి రూ. 4.00 కోట్లు విలువ చేసే సొత్తు అపహారణకు గురికాగా ఇప్పటి వరకు రూ. 1.95 కోట్ల సొత్తును రికవరీ చేసినట్లు ఎస్పీ వివరించారు.
 
 డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమాన్ని ప్రతి సోమవారం విజయవంతంగా నిర్వహిస్తున్నామని ఇందులో 382 మంది ఫోన్ ద్వారా ఫిర్యా దు చేయగా  364 మంది ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరించామని పేర్కొన్నారు.
 
 జిల్లాలో ఈ ఏడాది  23 నిర్భయ కేసులు నమోదు చేశామన్నారు. మరో 12 మంది మైనర్ బాలికలపై లైంగికదాడి, లైంగికదాడి యత్నాలకు పలుపడిన వారిపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.
 
 ఈ ఏడాది ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల నమోదు సంఖ్య తగ్గిందని , 2012లో 95  ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు కాగా ఈ ఏడాది  91  కేసులు నమోదయ్యాయన్నారు.
 
 ఈవ్‌టీజింగ్‌ను అరికట్టేందుకు  ప్రత్యేక ఎన్‌ఫోర్సుమెంట్ విభాగం చేపడుతున్న చర్యలు ఫలితాలను ఇస్తున్నాయని అన్నారు. గత ఏడాది 102 ఈవ్‌టీజింగ్ కేసులు నమోదు కాగా , 2013లో అవి 300లకు పెరిగాయని ఎస్పీ వివరించారు.

మరిన్ని వార్తలు