ప్రజల భద్రతకు కట్టుబడి ఉన్నాం: అవంతి

9 May, 2020 20:21 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: గ్యాస్ లీకేజీ‌ ఘటనను రాజకీయం చేస్తున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్‌ మండిపడ్డారు. విశాఖపట్నంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రభుత్వంపై బురదచల్లే విధంగా టీడీపీ ఆరోపణలు చేస్తోందని ధ్వజమెత్తారు. ఈ ఘటనకు, ప్రభుత్వానికి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రమాద సంఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం చాలా వేగంగా స్పందించిందన్నారు. పోలీసులు వెంటనే స్పందించకుండా ఉంటే ప్రమాద తీవ్రత మరోలా ఉండేదన్నారు. సంఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధితులను పరామర్శించడమే కాకుండా మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారని తెలిపారు.
(‘అది టీడీపీ దద్దమ్మల డ్రామా కమిటీ’)

మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు.. ఐఏఎస్‌లపై అవమానకరంగా వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. చంద్రబాబుకు తన మంత్రులపై నమ్మకం లేక తానే పనిచేసినట్లు ప్రచారం చేసుకోవడం అలవాటని దుయ్యబట్టారు. సీఎం వైఎస్‌ జగన్‌కు ప్రచారం అవసరంలేదన్నారు. ఏడుగురు మంత్రులు, సీఎస్‌ను విశాఖలోనే ఉండాలని సీఎం ఆదేశించారని పేర్కొన్నారు. ఫ్యాక్టరీతో తమకు సంబంధంలేదని, ఆ కంపెనీపై ప్రత్యేక ప్రేమలేదని మంత్రి స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని ఐదు గ్రామాల ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. తమకు ప్రజలే ముఖ్యమని తెలిపారు. చంద్రబాబుకు మనసు లేదని విమర్శించారు. పక్క రాష్ట్రంలో కూర్చోని ట్వీట్లు చేయడం సరికాదన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ప్రజల భద్రతకు  ప్రభుత్వం కట్టుబడి ఉందని అవంతి శ్రీనివాస్‌ స్పష్టం చేశారు.
(‘ప్రచార్భాటంతో ఆయనలా చేసి ఉంటే..’)

మరిన్ని వార్తలు