- ఒలింపియన్ షంషేర్ఖాన్ ఆనందం..‘సాక్షి’ కథనానికి స్పందించిన ప్రభుత్వం
- రూ.25 లక్షల నగదు అందజేత, ఇంటి స్థలం మంజూరు
విజయవాడ స్పోర్ట్స్: భారత్ తరఫున స్విమ్మింగ్లో ఒలింపిక్స్ (మెల్బోర్న్–1956)కు వెళ్లిన తొలి భారతీయుడు షంషేర్ఖాన్. 60 ఏళ్లుగా గుర్తింపు లేకుండా మారుమూల గ్రామంలో నివసిస్తున్న ఆయన గురించి గతేడాది జూలై 20న ‘ఎవరికీ పట్టని ఓ ఒలింపియన్’ అనే శీర్షిక పేరుతో ‘సాక్షి’ మెయిన్ స్పోర్ట్స్ పేజీలో ప్రచురితమైన కథనానికి ప్రభుత్వం నుంచి విశేష స్పందన లభించింది. సాక్షి కథనాన్ని చదివిన అధికారులు, ప్రజాప్రతినిధుల, క్రీడాభిమానులు ఈయన చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి అని కోరారు. అంతేకాదు ప్రభుత్వం రూ. 25 లక్షల నగదు నజరానా ప్రకటించి, ఇంటి స్థలాన్ని కూడా మంజూరు చేసింది. ఇటీవలే తనకు నగదు అందినట్లు షంషేర్ఖాన్ తెలిపారు.
‘సాక్షి’తోనే 60 ఏళ్లకు గుర్తింపు వచ్చింది: పాతిక లక్షల రూపాయల నజరానా అందుకున్న షంషేర్ఖాన్ను శనివారం ‘సాక్షి’ స్పోర్ట్స్ ప్రతినిధి పలుకరించగా ఆయన తన సంతోషాన్ని పంచుకున్నారు. ‘సాక్షిలో వచ్చిన కథనంతో నాకు 60 ఏళ్లకు గుర్తింపు వచ్చింది. నేను అందరికీ తెలిశాను. నరసరావుపేటలో జరిగిన ఖేలో ఇండియా జాతీయ క్రీడల్లో నాకు సన్మానం చేసి రూ. 25 లక్షల చెక్కు ఇచ్చారు. ఇటీవల నగదు ఇంటికి వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. సాక్షి యాజమాన్యానికి ధన్యవాదాలు’ అని తెలిపారు.