పయ్యావుల కేశవ్‌ అనుచరుడినే ప్రశ్నిస్తావా?

8 Jul, 2019 15:48 IST|Sakshi
పార్యం కేశవానంద

మహిళా ఎస్‌ఐపై టీడీపీ నేత వీరంగం

సాక్షి, ఉరవకొండ: మహిళా ఉద్యోగులపై టీడీపీ నేతల దౌర్జన్యం ఇప్పటికీ కొనసాగుతోంది. తాజాగా అనంతపురం జిల్లా ఉరవకొండలో టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ అనుచరుడు ఓ మహిళా ఎస్‌ఐపై దురుసుగా ప్రవర్తించిన ఘటన చర్చనీయాంశంగా మారింది. ఉరవకొండ ఎస్‌ఐ రాజోల్‌ రాజేశ్వరి శనివారం రాత్రి అనంతపురం–బళ్లారి జాతీయ రహదారిపై వాహనాల తనిఖీ నిర్వహించారు. రేణుమాకుపల్లి రహదారిలో ఓ వాహనం రోడ్డుకు అడ్డంగా ఉండటంతో తనిఖీ చేయగా పయ్యావుల కేశవ్‌ ప్రధాన అనుచరుడు పార్యం కేశవానంద తన అనుచరులతో మద్యం తాగుతూ కనిపించాడు.

ఇలా చేయడం తప్పని ఎస్‌ఐ చెప్పడంతో కేశవానంద ఒక్కసారిగా రెచ్చిపోయాడు. ‘నేను ఎవరో తెలుసా. ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ మనిషిని. నన్నే ప్రశ్నిస్తావా. మేము చేసేది ఇంతే. నీకు ఇష్టమున్న చోట చెప్పుకో’ అంటూ మద్యం మత్తులో నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ దురుసుగా ప్రవర్తించాడు. దీంతో ఎస్‌ఐ తన సిబ్బందితో కలిసి పార్యం కేశవానందను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. కేశవానందపై 506, 509, 353 సెక్షన్ల కింద నాన్‌ బెయిలబుల్‌ కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. 

మరిన్ని వార్తలు