Samajika Sadhikara Yatra: ‘సీఎం జగన్ వల్లే మహిళా సాధికారత సాధ్యం’

26 Oct, 2023 18:15 IST|Sakshi

సాక్షి, అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక న్యాయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వల్లే సాధ్యం అయ్యిందని ఏపీ స్త్రీ, శిశుసంక్షేమ శాఖ మంత్రి ఉషాశ్రీచరణ్‌ అన్నారు. గురువారం సాయంత్రం ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆధ్వర్యంలో.. సింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రంలో నిర్వహించిన సామాజిక సాధికార యాత్ర బహిరంగ సభకు వైఎస్సార్‌సీపీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నాయకులు మంత్రులు,  ఎమ్మెల్యేలు, పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు.

‘‘సామాజిక సాధికార యాత్ర అన్ని నియోజకవర్గాల్లో కొనసాగుతుంది. సీఎం జగన్‌ పాలనపై ఎల్లో మీడియా వక్రీరించే కథనాలు ఆపాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు జరుగుతున్న మంచిని చూడాలి. సామాజిక న్యాయం, మహిళా సాధికారత జగన్‌ వల్లే సాధ్యం అయ్యింది. టీడీపీ హామీలు నమ్మొద్దు. జగన్‌ మళ్లీ సీఎం అయితేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయి. ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీలు సీఎం జగన్‌కు అండగా నిలబడాలి’’ అని మంత్రి ఉషాశ్రీచరణ్ ప్రసంగించారు. 

‘‘వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాతికేళ్లు సీఎం గా ఉంటే పేద విద్యార్థులు ఉన్నత పదవులు అధిరోహిస్తారు. చంద్రబాబు అమరావతి పేరుతో మాయా ప్రపంచం సృష్టించారు. సీఎం జగన్‌ను ఎదుర్కోవడం నారా లోకేష్‌ వల్ల కాదు. జగన్‌ను భయపెట్టే మగాడు ఇంకా పుట్టలేదు. న్యాయం గెలిపించాలని భువనేశ్వరి అడగాల్సిన అవసరం లేదు. చంద్రబాబు విషయం లో న్యాయం గెలుస్తుంది.. చట్టం కూడా గెలుస్తుంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాయమాటలు నమ్మొద్దు అని ఎంపీ నందిగాం సురేష్ ప్రజలను కోరారు. 

పవన్ కల్యాణ్, నారా భువనేశ్వరి ఎన్ని యాత్రలు చేసినా జగన్ జైత్రయాత్ర ఆపలేరు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ లను అగ్రభాగాన నిలబెట్టిన ఘనత జగన్‌దే. వెనుకబడిన వర్గాలు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అండగా నిలవాలి అని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ పిలుపు ఇచ్చారు. 

‘‘జైలుకు వెళ్లిన తర్వాత చంద్రబాబు కు ప్రజలు గుర్తిస్తున్నారు. అబద్ధపు హామీలతో మరోసారి మోసం చేసేందుకు టీడీపీ - జనసేన సిద్ధం అవుతున్నాయి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ లకు 2.38 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌దే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన దేశానికే ఆదర్శం. పేదలకు అండగా జగన్ ప్రభుత్వం ఉంది. జగన్ సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శం’’ అని ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు.

‘‘టీడీపీ పాలనలో సామాజిక సాధికారత నిర్లక్ష్యానికి గురైంది. చంద్రబాబు బీసీలను ఓటు బ్యాంకులా చూశారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ లను మంత్రులు, ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు, ఎంపీలు గా చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దే. ఏపీలో ముస్లిం మైనార్టీకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం ఓ చరిత్ర. మాకు ప్రజలతోనే పొత్తు అని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ప్రసంగించారు.

మరిన్ని వార్తలు