టీడీపీ నేతలకు ఉలిక్కిపాటు ఎందుకు?:పెద్దిరెడ్డి

6 Jun, 2016 11:10 IST|Sakshi

చిత్తూరు : ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. సోమవారం ఆయన కాణిపాకంలో మాట్లాడుతూ చంద్రబాబును విమర్శిస్తే టీడీపీ నేతలకు ఉలిక్కిపాటు ఎందుకని సూటిగా ప్రశ్నించారు.  ప్రజలను మోసం చేసిన బాబుపై అన్ని మండల కేంద్రాల్లోని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు విస్మరించిన చంద్రబాబుకు త్వరలో ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు దివంగత నందమూరి తారక రామారావుపై చెప్పులు వేయించింది ఎవరో మరిచిపోయారా అని  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు.  రాష్ట్ర ప్రజలను మోసగించి అధికారం చేజిక్కించుకున్న తెలుగుదేశం పార్టీని ప్రజలు నిలదీసే రోజులు దగ్గర పడ్డాయని చెప్పారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేనప్పుడు రాజీనామా చేస్తే పరువు దక్కుతుందని సూచించారు.

ఇప్పుడున్న రాష్ట్ర మంత్రులకు ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించింది ఎవరో బాగా తెలుసునని చెప్పారు. ఒకవేళ వారికి మతిమరుపు ఉంటే... ఆ సంగతులను గుర్తు చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. అంతకు ముందు పెద్దిరెడ్డి కాణిపాకంలో వరసిద్ధి వినాయకస్వామిని దర్శించుకున్నారు.

మరిన్ని వార్తలు