‘జగన్‌కు అబద్ధాలు చెప్పే అలవాటు లేదు’

28 Jun, 2017 17:37 IST|Sakshi
‘జగన్‌కు అబద్ధాలు చెప్పే అలవాటు లేదు’

శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డికి అబద్ధాలు చెప్పడం అలవాటు లేదని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ అన్నారు. శ్రీకాకుళంలో జరిగిన పార్టీ ప్లీనరీలో మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్దిక పరిస్థితి అనుకూలంగా లేదనే ఎన్నికల్లో రైతు రుణమాఫీపై తప్పుడు హామీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. కోటయ్య కమిటీ సిఫార్సులును కూడా అమలుచేయకుండా సీఎం చంద్రబాబు రైతులకు దగా చేశారని ఆరోపించారు. కులాలవారీగా హామీ ఇచ్చి అమలు చేయకుండా నిలువునా మోసం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు హామీలే ఇప్పుడు ప్రభుత్వాన్ని పాము అయి కాటేస్తున్నాయన్నారు. ప్రజలకు మతి మరుపు ఎక్కువ అని చంద్రబాబు భ్రమలో ఉన్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర రాజకీయాలను నేరమయం చేస్తున్నారని అన్నారు.

టీడీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, ప్లీనరీ తర్వాత వైఎస్సార్‌సీపీ మరింత నిర్మాణాత్మకమైన పార్టీగా బలపడుతుందని ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు అభద్రతా భావంలో జగన్‌పై విమర్శలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి ధ్వజమెత్తారు. జిల్లా మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు పాలనను గాలికి వదిలేశారని విమర్శించారు. ఇసుక వ్యాపారం కోసమే ఎమ్మెల్యే కలమట వెంటకరమణ పార్టీ మారారని ఆరోపించారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం, కోలగట్ల వీరభద్రస్వామి, వరుదు కళ్యాణి తదితర నాయకులు ప్లీనరీకి హాజరయ్యారు.

మరిన్ని వార్తలు