ఏడవరా కన్నా..!

20 Jul, 2014 23:59 IST|Sakshi
ఏడవరా కన్నా..!

చిన్నపిల్లలు ఏడిస్తే.. ఏడవద్దురా కన్నా నీకు తాయిలాలు పెడతా అని మురిపించి ఏడుపును మరిపించడం అందరికీ తెలిసిందే. అయితే కర్నూలు జిల్లా ప్యాపిలికి చెందిన ఓ పిల్లాడు మాత్రం పుట్టినప్పటి నుంచి ఏడవకపోవడం తల్లిదండ్రులను కలచివేస్తోంది. స్థానిక శ్రీరామ థియేటర్ సమీపంలో నివాసం ఉంటున్న రమేష్, లక్ష్మీదేవి దంపతులకు ఇరువురు సంతానం. పెద్ద కుమారుడు అరవింద్(7) పుట్టినప్పటి నుంచి ఏడవకపోవడం తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. వైద్యులు పరీక్షించి ఎలాంటి అనారోగ్య సమస్య లేదని చెబుతున్నా.. వారి మనసు కుదుటపడటం లేదు.

ప్రస్తుతం ఒకటో తరగతి చదువుతున్న ఈ పిల్లాడు.. కొట్టినా, తిట్టినా, గిచ్చినా కంట్లో నీటి చుక్క రాకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. రెండో కుమారుడు అఖిల్(5) మాత్రం అందరిలానే ఏడుస్తుండటంతో పెద్ద కుమారుని విషయంలో తల్లిదండ్రులు బెంగ పెట్టుకున్నారు. సాధారణంగా పిల్లల కంట్లో కన్నీరు వస్తే తల్లిదండ్రులు తట్టుకోలేరు.. కానీ ఈ తల్లిదండ్రులు మాత్రం కుమారుడు ఏడిచే రోజు కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ఈ విషయమై స్థానిక వైద్యాధికారి చెన్నకేశవులును వివరణ కోరగా బాలుడికి స్వరపేటికలో సమస్య ఉండొచ్చని తెలిపారు.
 -ప్యాపిలి
 

మరిన్ని వార్తలు