పథకం పూర్తిస్థాయిలో అమలు జగన్కే సాధ్యం
టీడీపీ పూర్తిగా నిర్లక్ష్యం చూపుతోందని విమర్శలు
సాక్షి, గంపలగూడెం: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అమలు చేసిన ఆరోగ్యశ్రీ పేదల పాలిట సంజీవనిగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయింది. ఆరోగ్యశ్రీ లేకుంటే కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్ళే స్థాయి పేద, మధ్య తరగతి కుటుంబాలకు లేదు. ఆ పరిస్థితిలో పెద్ద రోగం వస్తే దేవుని మీద భారం వేసి స్థానికంగా ఉండే వైద్య సేవల్ని మాత్రమే పొందుతూ ఉండే వారు. ఆరోగ్యశ్రీ పథకం వచ్చాక ఎంతో ధైర్యంగా కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లి వైద్య సేవలు ఉచితంగా పొందామంటూ ప్రజలు మహానేతను గుర్తుకు తెచ్చుకుంటున్నారు.
వైఎస్ మరణానంతరం ఆరోగ్యశ్రీ పథకాన్ని టీడీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేశారని మండిపడుతున్నారు. ఆరోగ్యశ్రీ పథకం తిరిగి పూర్తిస్థాయిలో అమలు జరగాలంటే వైఎస్ తనయుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలని అన్ని వర్గాల ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.
ఎందరికో ప్రాణదానం చేసింది..
ఆరోగ్యశ్రీ పథకం ఎంతో మంది ప్రాణాల్ని కాపాడింది. పేదలకు సంజీవని లాంటిది. ఆరోగ్యశ్రీకి ముందు పేదలకు సరైన వైద్య సదుపాయాలు లేక అనేక ఇబ్బందులు పడేవారు. అయితే, టీడీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని నీరుగార్చింది.
– కోట దాసు, మాజీ ఎంపీపీ, గంపలగూడెం
పథకాన్ని టీడీపీ నీరుగార్చింది..
పేదలకు వరంలా ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డికే దక్కుతుంది. ఈ పథకం ద్వారా అవసర సమయాల్లో నిరుపేదలు సైతం లక్షలాది రూపాయల వైద్య సేవల్ని పొందగలిగారు. ఈ పథకాన్ని టీడీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది.
–చెరుకు నర్సారెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యులు, కనుమూరు
ఉచితంగా పెద్ద ఆపరేషన్లు..
ఆరోగ్యశ్రీ పథకంతో అవసరమైన రోగులకు పెద్ద పెద్ద శస్త్రచికిత్సలు సైతం ఉచితంగా నిర్వహించటంతో ప్రాణదానం అయ్యింది. ఈ పథకమే లేకుంటే ఎన్నో కుటుంబాలు తీవ్రంగా నష్టపోయేవి. వెయ్యి రూపాయలు దాటిన వైద్య సేవల్ని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువస్తానని జగన్ ప్రకటించడం పేదలకు మరింత మేలు చేసే విధంగా ఉంది.
– బొల్లా కరుణాకరరావు, కొణిజెర్ల