అమరావతి చూడర బాబూ..

17 Feb, 2019 07:33 IST|Sakshi

రాజధాని పర్యటన పేరిట కనికట్టు

చంద్రబాబు ప్రభుత్వం ప్రచార ఆర్భాటం

జిల్లా నుంచి 39 బస్సుల్లో తరలింపు

జిల్లాకు  28 లక్షలపైగా వ్యయం

కోట్లలో ప్రజాధనం దుర్వినియోగం  

ప్రజలకు బోధపడని రాజధాని పర్యటన

రాజధాని అమరావతి పర్యటన పేరిట టీడీపీ ప్రభుత్వం ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించింది. అక్కడ రాజధాని నిర్మాణం పూర్తికాకుండానే ఊహలలోకంలో విహరింపజేసింది. ఇంకా నిర్మాణ దశల్లో బిల్డింగ్‌లు, తాత్కాలిక భవనాలు, చాలాచోట్ల బీడుగా కనిపిస్తున్న పొలాలు, వీటి మధ్యలో తారురోడ్లు ఉండగా, ఏకంగా జానపద చిత్రాల బ్రహ్మ బీ విఠలాచార్య సినిమాలను తలపించేలా నవ్య రాజధాని అని భ్రమింపజేసింది. ఈ విధంగా కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేసింది. పైగా ఆర్థిక నష్టాల్లో ఉన్న ఆర్టీసీని మరింత కష్టాల్లోకి నెట్టింది.

శ్రీకాకుళం పాతబస్టాండ్‌:  రాజధానిని చూపించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి రాజధాని పర్యటనకుగాను ఉచిత బస్సులు వేసింది. దీని ప్రధాన లక్ష్యం రాజధానిని ప్రజలకు చూపించడమే అయితే అక్కడ ఇంకా అన్ని వసతులు ఏర్పాటు చేయలేదు. అన్ని హంగులతో భవన నిర్మాణాలు పూర్తికాలేదు. అయితే మన జిల్లాలో ఈ కార్యక్రమాన్ని గతేడాది డిసెంబర్‌ 10న ప్రారంభించారు. జిల్లాలో 38 మండలాలతోపాటు శ్రీకాకుళం అర్బన్‌ నుంచి అమరావతికి 39 బస్సులు వేశారు. ఈ ప్రచారం ఈ నెల 10వ తేదీ వరకు కొనసాగింది.

సందర్శకుల ఖర్చులన్నీ..
జిల్లా నుంచి అమరావతి రాజధానికి 39 ఆర్టీసీ బస్సులు వేశారు. ఒక బస్సు ముందు రోజు సాయంత్రం ఏడు గంటలకు శ్రీకాకుళం లేదా, ఆ మండలం కేంద్రంలో బయలుదేరి, రెండో రోజు ఉదయానికి అమరావతి చేరేది. పగలంతా పర్యటించిన తరువాత ఆ రోజు సాయంత్రం అక్కడ్నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం తిరిగి స్వస్థలానికి చేరేది. అయితే ఒక మండలానికి ఒక బస్సు వేశారు. శ్రీకాకుళం అర్బన్‌కు మరో బస్సు నడిపారు. ఒక బస్సులో 48 మంది ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఈ బస్సు రానుపోను ఆర్టీసీకి రూ. 55 వేలు చెల్లించాల్సి ఉంది. దీనిని బట్టి మొత్తం 39 బస్సులకుగాను రూ. 22 లక్షలు చెల్లించాలి. అదేవిధంగా ఈ బస్సులో అమరావతికి వెళ్లిన సందర్శకులకు భోజనాలు, టిఫిన్‌ ఇతర ఖర్చులు వగైరా ఒక వ్యక్తికి రూ. 300 వరకు ఖర్చు పెట్టారు. దీనిబట్టి 39 బస్సుల ఆక్క్యుఫెన్సీతో కలిపితే జిల్లా నుంచి 1872 మంది వరకు అమరావతికి వెళ్లారు. వీరితోపాటు గైడ్, అధికారి చొప్పున ఉన్నారు. వీరందరికీ భోజనాల ఖర్చులు రూ. 6.20 లక్షల వరకు ఉంటాయి. అంటే ఆర్భాటం ఖర్చులు రూ. 28 లక్షలుగా ఉంటాయన్నది అంచనా. ఈ భారంలో ఎక్కువగా ఆర్టీసీపైనే మోపారు.

ఆర్టీసీపై మోయలేని భారం
ఇప్పటికే జిల్లా ఆర్టీసీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కోట్లలో బకాయిలు చెల్లించాల్సి ఉంది. గతంలో  సీఎం పర్యటన కార్యక్రమాలు, పసుపు కుంకుమల సమయంలో సీఎం పర్యటన చేసినవి, ఇలా చాలా వరకు బకాయిలు ఉన్నాయి. ఈసారి అమరావతి సందర్శన యాత్ర పేరిట బస్సులు సరఫరా చేసినందుకు రూ. 22 లక్షలు కూడా ఆర్టీసీకి భారంగా మారింది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీకి రీయింబర్సుమెంటు చేయడంలో వెనకంజ వేస్తోంది. పైగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఆర్టీసీ మనుగడకు సంకటంగా మారుతున్నాయి.

అనవసర ఖర్చు..
రాజధాని పర్యటన పేరిట పెట్టిన అన్ని ఖర్చులు సీఆర్‌డీఏ నిధులు వినియోగిస్తున్నట్టు చెబుతున్నారు. అయితే ఆ నిధులు సైతం ప్రజాధనంగా ప్రభుత్వం ఆలోచించడం లేదు. ఆర్థిక ఇబ్బందులల్లో ఉన్నామని చెబుతూనే ఇలా అనవసర ఖర్చులు పేరిట ప్రజాధనం దుర్వినియోగం చేసుకోవడం చూస్తుంటే, ఇది కేవలం ప్రచారం కోసం తప్ప, ప్రజల కోసం కాదని, లేని రాజధాని ఉన్నట్టు కనికట్టు చూపేందుకే అమరావతి సందర్శన అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చాలామంది సందర్శకులు ఈ ప్రభుత్వం ఎందుకు రాజధానిని చూపించే ప్రయత్నం చేసిందో, అక్కడ ఏ నిర్మాణాలు పూర్తికాని పరిస్థితిలో ఏమీ అర్థం కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు