ఫీజు చెల్లించలేదని ఎండలో నిలబెట్టారు

13 Sep, 2017 02:01 IST|Sakshi
ఆకివీడు: స్కూలు ఫీజు చెల్లించలేదని పాఠశాల యాజమాన్యం విద్యార్థుల్ని ఎండలో నిలబెట్టింది. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులోని రవీంద్రభారతి విద్యాసంస్థలో రెండు రోజులుగా విద్యార్థుల్ని తరగతి గది నుంచి బయటకు పంపించి బాత్‌రూమ్‌ ఉన్న ప్రాంతం వైపు నుంచోబెడుతున్నారు. మంగళవారం కూడా ఇదే పరిస్థితి నెలకొనడంతో విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చి స్కూల్‌ వద్ద ఆందోళన నిర్వహించారు.

ఫీజులు చెల్లించకుంటే విద్యార్థుల్ని బాత్‌రూముల వద్ద ఎండలో నుంచోబెడతారా.. అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒకటి, రెండు, మూడు తరగతులు చదువుతున్న దున్నల ప్రసన్న, డి.సాయివరప్రసాద్, వాసా యషిత మాట్లాడుతూ ఫీజు చెల్లించలేదని తమను బయటకు పంపి బాత్‌రూమ్‌ వద్ద నుంచోబెట్టారని విలేకరులతో చెప్పారు. ఇదే విషయాన్ని స్కూల్‌కు వచ్చిన ఎంఈవో ఎ.రవీంద్రకు వివరించారు. పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు దున్నల శ్రీనివాస్, మువ్వల నాగరాజు డిమాండ్‌ చేశారు. దీనిపై విచారణ నిర్వహించి ఉన్నతాధికారులకు తెలియజేస్తానని ఎంఈవో చెప్పారు. 
మరిన్ని వార్తలు