సహకరించాలని పవన్ ను కోరా:చంద్రబాబు

1 Mar, 2015 13:22 IST|Sakshi
సహకరించాలని పవన్ ను కోరా:చంద్రబాబు

హైదరాబాద్:రాజధాని నిర్మాణంలో సహకరించాలని ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ ను కోరినట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా చంద్రబాబు పేర్కొన్నారు. ఆదివారం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అయిన సంగతి తెలిసిందే.అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. రాజధాని నిర్మాణానికి సహకరించాల్సిందిగా పవన్ ను కోరానన్నారు.  భూసమీకరణ భూములు కోల్పోయిన రైతులకు పరిహారం ఉదారంగానే అందించామన్నారు. బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని చంద్రబాబు మరోసారి తెలిపారు.

 

పవన్ కళ్యాణ్ ఆదివారం ఉదయం చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. గత కొన్ని రోజుల క్రితం రాజధాని భూములకు సంబంధించి రైతులు నిరసన వ్యక్తం చేయడంతో వారి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. రాజధాని భూములు విషయంలో  చంద్రబాబును పవన్ ప్రశ్నించాలని రైతులు డిమాండ్ చేయడం తెలిసిందే. అయితే ఇటీవలే కేంద్రం తన హామీలను నెరవేర్చుకునే సమయం వచ్చిందంటూ పవన్ ట్విట్టర్ లో పేర్కొనడం కూడా చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని వార్తలు