ఆటలో గొడవ ప్రాణం తీసింది

14 Aug, 2019 08:26 IST|Sakshi

క్రికెట్‌ మ్యాచ్‌ ఓడిపోతున్నామని అక్కసుతో తోటి విద్యార్థి దాడి

తీవ్రమైన కడుపునొప్పితో  విజయ్‌ మృతి

ఎన్‌ఏడీ జంక్షన్‌(విశాఖ పశ్చిమ): క్రికెట్‌లో గొడవ విద్యార్థి ప్రాణం తీసింది. కడుపులో గట్టిగా కొట్టడంతో విద్యార్థి చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందిన ఘటన పాతకరాసాలో విషాదాన్ని నింపింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పాతకరాసాకు చెందిన మరుబారికి రామారావు కుమారుడు విజయ్‌(13) ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. సోమవారం ఇంటి దగ్గరలోని ఖాళీ స్థలంలో క్రికెట్‌ ఆడేందుకు స్నేహితులతో వెళ్లాడు. పాతకరాసాకు చెందిన చిన్నసాయితో కలిసి రెండు టీములుగా ఏర్పడి క్రికెట్‌ ఆడాడు.

రెండు మ్యాచ్‌ల్లో విజయ్‌ టీమ్‌ గెలిచింది. మూడో మ్యాచ్‌ కూడా గెలుపు దిశగా ఉండడంతో సాయి గొడవ పడ్డాడు. ఇది కొట్లాటకు దారితీసింది. సాయి.. విజయ్‌ కడుపు భాగంలో చేతితో పిడి గుద్దులు గుద్దడమే కాకుండా బ్యాట్‌తో కొట్టినట్లు అక్కడి వారు చెబుతున్నారు. నొప్పితో విజయ్‌ ఆటస్థలంలో పడిపోయాడు. కొద్దిసేపటి తరువాత తోటివారి సహాయంతో ఇంటికి చేరాడు. కడుపు నొప్పి ఉందని చెప్పడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. కడుపు లోపలి భాగంలో గట్టి దెబ్బలు తగలడంతో మంగళవారం రాత్రి విజయ్‌ మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు. దీనిపై మృతుడు తల్లిదంద్రులు ఎయిర్‌పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

మరిన్ని వార్తలు