ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా రాష్ట్ర భవిష్యత్తే లక్ష్యంగా పోరాడుతున్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్.జగన్మోహన్రెడ్డిని విమర్శిస్తున్న రాజకీయ రాబందులను చీల్చిచెండాడేందుకు రాష్ట్ర యువతసిద్ధమైంది. సమైక్యాంధ్ర పోరాటాన్ని ముందుండి నడిపించిన ఎస్వీయూ విద్యార్థులు ప్రత్యేకహోదా ఉద్యమంలోనూ అదే తెగువ చూపిస్తున్నారు. సోమవారం పరిశోధక విద్యార్థి
ఆత్మహత్యాయత్నంతో విశ్వవిద్యాలయం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. -
యూనివర్సిటీ క్యాంపస్: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ఎస్వీయూ క్యాంపస్ విద్యార్థులు కదం తొక్కారు. దీంతో యూనివర్సిటీలో ప్రత్యేకహోదా కోసం చేపట్టిన ఉద్యమం పతాకస్థాయికి చేరుకుంది. వారం రోజులుగా వివిధ రూపాల్లో జరుగుతున్న ఆందోళనా కార్యక్రమాలు తారస్థాయికి చేరుకున్నాయి. సోమవారం మాసుం ఇండియా అనే పరిశోధక విద్యార్థి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఒక వైపు జగన్ ఆరోగ్యం క్షీణిస్తుండడం, మరోవైపు ప్రత్యేకహోదాపై కేంద్రం పట్టించుకోకపోవడం, మరోవైపు- రాష్ట్ర మంత్రులు జగన్ దీక్షపై విమర్శల చేస్తూ వక్రభాష్యం
చెబుతుండడంతో విద్యార్థుల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. గతంలో ఎస్వీయూ వేదికగా సమైక్యాంధ్ర ఉద్యమాలు తీవ్రస్థాయిలో జరిగాయి. విద్యార్థులు యూనివర్సిటీ వాహనాలను సైతం తగలబెట్టారు. సెల్టవర్లు ఎక్కి ఆత్మహత్యాయత్నాలు చేశారు. ఎస్వీయూ పరిపాలనా భవనం పైకి ఎక్కి దూకే ప్రయత్నం చేశారు. ప్రస్తుత ఉద్యమం కూడా వివిధ ఆందోళన కార్యక్రమాలతో మలుపులు తిరుగుతోంది.
నేటి నుంచి మరింత ఉధృతం
ఎస్వీయూ వేదికగా ప్రత్యేక హోదా కోసం ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాలని విద్యార్థి వర్గాలు నిర్ణయించాయి. కేంద్రం దిగి వచ్చి ప్రత్యేకహోదా ఇచ్చేవరకు ఉద్యమించాలని తీర్మానించాయి. ఈ నేపథ్యంలో ఏక్షణంలో ఎలాంటి సంఘటనలు జరుగుతాయోనని నిఘా వర్గాలు, పోలీసు వర్గాలు, అధికార వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.