విద్యార్థినిపై ఇద్దరు వ్యక్తుల దాడి

26 Aug, 2014 01:14 IST|Sakshi
విద్యార్థినిపై ఇద్దరు వ్యక్తుల దాడి

చాకుతో చేయి కోసిన వైనం
 
భీమవరం : సైకిల్‌పై స్కూల్‌కు వెళుతున్న విద్యార్థినిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి పరారైన ఘటన భీమవరంలో చోటు చేసుకుంది. భీమవరం వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక గునుపూడికి చెందిన పొన్నాడ రాంబాబు కుమార్తె మేఘన హౌసింగ్‌బోర్డు కాలనీలోని ఆదిత్య స్కూల్‌లో పదవ తరగతి చదువుతుంది.

ఎప్పటి మాదిరిగానే సోమవారం సైకిల్‌పై స్కూల్‌కు వెళుతుండగా స్థానిక వన్‌టౌన్‌లోని శ్రీనివాస థియేటర్ రోడ్‌లోకి వచ్చేసరికి ఇద్దరు వ్యక్తులు మొహానికి ఖర్చీఫ్‌లు కట్టుకుని మోటారు సైకిల్‌పై వెళుతూ విద్యార్థిని చేతిని చాకుతో కోసి పరారయ్యారు. చేతి నుంచి రక్తం కారడంతో స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థినిని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. అనంతరం వన్‌టౌన్ పోలీసుకు ఫిర్యాదు చేశారు. పది రోజులుగా ఇద్దరు వ్యక్తులు మోటారు సైకిల్‌పై తన వెనుక వస్తూ వేధిస్తున్నారని విద్యార్థిని ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్ పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు