నంద్యాలలో టీడీపీది పచ్చిమోసం

19 Sep, 2017 01:58 IST|Sakshi
నంద్యాలలో టీడీపీది పచ్చిమోసం
- ఉప ఎన్నికలో ప్రభుత్వ అక్రమాలను బయటపెట్టిన మాజీ ఎంపీ ఉండవల్లి
ఎన్నికకు ముందు డ్వాక్రా మహిళల ఖాతాకు రూ. 4 వేలు జమ
 
రాజమహేంద్రవరం సిటీ: నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ మోసాలకు సంబంధించి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ సంచలన విషయాలు బయటపెట్టారు. గెలుపు కోసం ఏ విధంగా అధికార పార్టీ అడ్డదారులు తొక్కిందో సాక్ష్యాధారాలతో సహితంగా వివరించారు. సోమవారం రాజమహేంద్రవరంలోని ఆనం రోటరీ హాల్‌లో విలేకరులతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా కేవలం నంద్యాలలో మాత్రమే డ్వాక్రా మహిళల ఖాతాల్లో చంద్రబాబు ప్రభుత్వం డబ్బు జమచేసిందని, ఉప ఎన్నికకు ముందు ఒక్కో ఖాతాలో రూ. 4 వేలు చొప్పున వేసిందని ఉండవల్లి వెల్లడించారు. 

జూలై 17 నుంచి ప్రారంభించి ఒక్కో గ్రూపునకు రూ. 48 వేలు చొప్పున జమచేశారని తెలిపారు. ఈ తతంగాన్ని నెల రోజుల్లో ముగించారని పేర్కొన్నారు. వాటికి సంబంధించిన పాస్‌బుక్‌ల కాపీలను మీడియాకు చూపారు.  ఉప ఎన్నికకు ముందు ఇలా చేయడం చాలా తీవ్రమైన అంశమని, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని అన్నారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి కూడా తీసుకెళ్లాలని తెలిపారు.  అసెంబ్లీ ఎన్నికల్లో డ్వాక్రా మహిళలకు చంద్రబాబు హామీ ఇచ్చిన విధంగా రూ. పదివేల రుణాన్ని రద్దు చేయలేదు కానీ, నంద్యాలలో మాత్రం ఉప ఎన్నికకు ముందే అక్కడి మహిళల ఖాతాల్లో రూ. 4 వేలు చొప్పున జమచేయడం దారుణమని ఉండవల్లి అన్నారు.