సర్వే ముసుగులో ఓటర్ల తొలగింపు!

12 Nov, 2018 12:26 IST|Sakshi
సర్వే బృందంలోని సభ్యులు ట్యాబ్‌లో ఉన్న అంశాలు

రౌడూరులో అడ్డంగా దొరికిన బృందం

కర్నూలు, కౌతాళం: సర్వే పేరుతో ఓట్లు తొలగిస్తూ ఓ బృందం దొరికిపోయింది. మండల పరిధిలోని రౌడూరు గ్రామంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది.  నల్గురు సభ్యులు కల్గిన బృందం ఒకటి సర్వే పేరిట గ్రామానికి వచ్చింది. ప్రభుత్వ పనితీరు గురించి అడిగినట్లే అడిగి ఇంటి నంబరుతో పాటు ఫోన్‌ నంబర్లు కూడా సేకరించి ట్యాబ్‌లో సేవ్‌ చేసి ఆన్‌లైన్‌ చేస్తుండడంతో గ్రామస్తులు, వైఎస్సాఆర్సీపీ నాయకులు నర్సారెడ్డి, ఏకాంబర్‌రెడ్డి, లక్ష్మికాంత్‌రెడ్డిలు అడ్డుకున్నారు. ప్రభుత్వ పనితీరుతో పాటు ఈసారి ఎన్నికల్లో ఎవరికి ఓటు వేస్తారని, అధికారంలో ఎవరు వస్తే బాగుంటుందని ప్రశ్నలు అడుతున్నారు. చంద్రబాబు అంటే ఎస్‌ అని వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అంటే నో అని సేవ్‌ చేసి ఆన్‌లైన్‌ చేయడంతో గ్రామస్తులు ఇది టీడీపీ సర్వే అని నిర్ధారించుకున్నారు. వైఎస్సార్‌సీపీ ఓటర్లను ఉద్దేశపూర్వకంగా తొలగిస్తున్నారని    అక్కడే ఉన్న పోలీసులకు సమాచారం అందించడంతో వారు వచ్చి వివరాలను సేకరించారు.

ఈ సందర్భంగా బృందంలోని సభ్యులు మాట్లాడుతూ.. తాము పీపుల్స్‌పల్స్‌ వాయిస్‌ సంస్థ తరఫున వచ్చినట్లు తెలిపారు. గ్రామంలో 25 మందితో సర్వే చేయమని తమ సంస్థ మేనేజర్‌ చెప్పారని తెలిపారు. తాము ఎమ్మిగనూరులోని సిద్ధార్థ కాలేజిలో డిగ్రీ చదువుతున్న విద్యార్థులమని, సెమిష్టర్‌ పరీక్షలు పూర్తి కావడంతో డబ్బులు వస్తాయని వచ్చామని తెలిపారు.  దీని గురించి తెలియదని వివరించారు. ఎమ్మిగనూరులోని మల్లికార్జున హోటల్‌లో తమ సంస్థ ప్రతినిధి ఉంటాడని చెప్పారు.  శనివారం.. మంత్రాలయం మండలంలోని వగూరుర్‌లో కూడా సర్వే చేసినట్లు చెప్పుకొచ్చారు.  బృంద సభ్యులను రాత్రి కౌతాళం స్టేషన్‌కు పిలిపించి వారి వివరాలు సేకరించి వదిలిపెట్టారు. ర్వేల పేరిట తెలుగుదేశం పార్టీ ప్రజల్ని మోసం చేస్తోందని వైస్సాఆర్సీపీ నాయకులు ఏకాంబర్‌రెడ్డి, నర్సారెడ్డి, లక్ష్మికాంత్‌రెడ్డి ఆరోపించారు. సర్వేలో జగన్‌కు మద్దతు తెలిపితే ఇంటి నంబరు, ఫోన్‌ నంబరు సేకరించి ఓటర్లను తొలగిస్తున్నారన్నారు. హామీలను నేరవేర్చి ప్రజల్లో నమ్మకాన్ని పెంచుకోవాలని,  దొంగ సర్వేల పేరిట ఓటర్లను తొలగించడం తగదన్నారు.

మరిన్ని వార్తలు