పేదల ప్రాణాలు పట్టవా?

28 Jul, 2018 08:21 IST|Sakshi
 పడిదెంపాడు గ్రామ చావిడిలో బాధితులను పరామర్శిస్తున్న వైఎస్‌ఆర్‌సీపీ కోడుమూరు సమన్వయకర్త మురళీకృష్ణ

కర్నూలు సీక్యాంప్‌: కర్నూలు మండలం పడిదెంపాడు గ్రామంలో మూడు రోజులుగా  ప్రజలు అతిసార వ్యాధి బారిన పడి అల్లాడిపోతున్నా అధికారులు, పాలకులు కన్నెత్తి చూడటం లేదని, వారికి పేదల ప్రాణాలు పట్టవా అంటూ వైఎస్‌ఆర్‌సీపీ కోడుమూరు సమన్వయకర్త పరిగెల మురళీకృష్ణ ప్రశ్నించారు. శుక్రవారం ఆయన గ్రామానికి చేరుకుని గ్రామ చావిడిలో చికిత్స పొందుతున్న అతిసార బాధితులను పరామర్శించారు. ఎస్సీ కాలనీలో ప్రతి ఇంటికెళ్లి అస్వస్థతకు గురైన వారు వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ మూడు రోజులుగా గ్రామంలో అతిసార విజృంభిస్తున్నా అధికారులు, ప్రజా ప్రతినిధులు గ్రామం వైపు చూడలేదని విమర్శించారు. గ్రామానికి మంచినీరు సరఫరా చేసే ట్యాంక్‌ను శుభ్రం చేయకపోవడంతోనే అతిసార ప్రబలిందన్నారు. గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యంతోనే ఉసేన్‌బీ అనే మహిళ అతిసార బారిన పడి మృతి చెందిందన్నారు. ఎమ్మెల్యేతోపాటు టీడీపీ  కోడుమూరు ఇన్‌చార్జి, అధికార పార్టీ నేతలకు ఎన్నికలప్పుడు మాత్రమే ప్రజలు గుర్తుకొస్తారని విమర్శించారు. ఆయన వెంట వైఎస్‌ఆర్‌సీపీ ఎస్సీసెల్‌ కర్నూలు మండల అధ్యక్షుడు పసుపల నాగరాజు, బాషా, రాజు, రవి తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు