4జీ వస్తోంది రెడీనా?

13 Jan, 2015 00:25 IST|Sakshi
4జీ వస్తోంది రెడీనా?

ఫిబ్రవరి నుంచి తెలంగాణ, ఏపీలో తొలిసారిగా ఎయిర్‌టెల్ సేవలు
జూన్‌కల్లా రిలయన్స్ జియో రంగంలోకి  
3జీ మాదిరిగానే చార్జీలు!

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: శ్రీను ఫోన్లో 3జీ కనెక్షన్ ఉంది. పోకిరి సినిమా డౌన్‌లోడ్ చేయాలంటే ఇపుడు 41.30 నిమిషాల సమయం పడుతోంది. శ్రీనుకు చికాకు పుడుతోంది. కానీ మరో నెల రోజులు ఆగితే ఈ చికాకు ఉండదు. ఎందుకంటే 4జీ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి.

అప్పుడు పోకిరి సినిమా మొత్తం 9.30 నిమిషాల్లో డౌన్‌లోడ్ అయిపోతుంది. అవునండీ నిజమే! 3జీతో సాధ్యం కాని లైవ్ ఫీడ్ ట్రాన్స్‌మిషన్ వంటి సేవల్ని ఈజీగా సాకారం చేయటానికి... 3జీతో పోలిస్తే 5 రెట్ల వరకు వేగవంతమైన ఇంటర్నెట్ సర్వీసు అందించడానికి 4జీ వచ్చేస్తోంది. ఫిబ్రవరిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌లో ఈ సేవలను ఆరంభించేందుకు టెలికం సేవల సంస్థ ఎయిర్‌టెల్ సిద్ధమయింది. తొలుత హైదరాబాద్‌లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. మరోవంక జూన్‌కల్లా రిలయన్స్ జియో కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌లో 4జీతో అడుగు పెట్టబోతోంది.

 

దేశవ్యాప్తంగా 800 నగరాల్లో సేవలందించేందుకు కంపెనీ ప్రణాళికలు సిద్ధం చేసింది. పరిస్థితులు అనుకూలించగానే 4జీ సేవలు ప్రారంభించేందుకు రెడీగా ఉన్నామని యునినార్, ఎయిర్‌సెల్ చెబు తున్నాయి. 2015 డిసెంబరుకల్లా భారత్‌లో 4జీ కస్టమర్ల సంఖ్య 1-1.5 కోట్లకు చేరుకుంటుందని అంచనా.

ఎయిర్‌టెల్‌తోనే ప్రారంభం..: ఎయిర్‌టెల్ సంస్థ 2012 ఏప్రిల్‌లో కోల్‌కతాలో 4జీ సేవలను ఆరంభించటం ద్వారా ఇండియాకు హైస్పీడ్ ఇంటర్‌నెట్‌ను పరిచయం చేసింది. తర్వాత  బెంగళూరు, చండీగఢ్, అమృత్‌సర్, నాసిక్, నాగ్‌పూర్ తదితర 16 నగరాలకు విస్తరించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌లో వచ్చే నెలలో 4జీని ప్రవేశపెడుతున్నట్టు ఎయిర్‌టెల్ ఉన్నతాధికారి ‘సాక్షి’ బిజినెస్ బ్యూరోకు చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన ప్రాంతాల్లో తొలుత 4జీని మొదలు పెడతారు. తర్వాత వైజాగ్, విజయవాడకు పరిచయం చేస్తారు. 2014 ఫిబ్రవరిలో తొలిసారిగా మొబైల్‌లో 4జీ సేవల్ని ఆరంభించింది కూడా ఎయిర్‌టెల్ కావటం గమనార్హం. అంతకు మునుపు కస్టమర్లు డాంగిల్ సాయంతో డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌లలో 4జీని వాడేవారు.
 
చార్జీలు 3జీ స్థాయిలోనే..: చార్జీలు 3జీ మాదిరిగానే ఉంటాయని ఎయిర్‌టెల్ చెబుతోంది. వైఫై రూటర్స్, డాంగిల్స్‌తోపాటు మొబైల్ ఫోన్లను బండిల్ ఆఫర్‌లో తక్కువ ధరకే అందిస్తామని వెల్లడించింది. షియోమి రెడ్‌మి నోట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌ను రూ.9,999 ధరలో ఎయిర్‌టెల్ విక్రయిస్తోంది. ఎయిర్‌టెల్ బెంగళూరులో 3జీ/ 4జీ మొబైల్ ప్రీపెయిడ్ రీచార్జ్ ప్యాక్‌లు రూ.9 నుంచి విక్రయిస్తోంది.

ఒక రోజు వ్యాలిడిటీ గల రూ.9 ప్యాక్‌తో 25 ఎంబీ డేటా అందుకోవచ్చు. 28 రోజుల వ్యాలిడిటీతో 1 జీబీ డేటా ధర రూ.255 ఉంది. షియోమీ కస్టమర్లకు రూ.250లకు రెండింతల బెనిఫిట్‌తో 2జీబీ ఆఫర్ చేస్తోంది. డాంగిల్, వైఫై డాంగిల్, హాట్‌స్పాట్ ప్లాన్స్‌లో రూ.450లకు 4 జీబీ డేటా ఇస్తోంది. తెలంగాణ, ఏపీ సర్కిల్‌లోనూ ఎయిర్‌టెల్ ప్యాక్‌ల ధరలు ఇదే విధంగా ఉండే అవకాశం ఉంది.
 
అందుబాటు ధరలో మొబైల్స్, గాడ్జెట్స్..
4జీ సేవలు విస్తృతం కానుండటంతో గాడ్జెట్ల పోటీ కూడా మొదలైంది. ప్రస్తుతం 4జీ స్మార్ట్‌ఫోన్లు రూ.10 వేలలోపు ధరలోనే లభిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ లుమియా 638 మోడల్‌ను రూ.8,299లకు, జోలో ఎల్‌టీ 900 మోడల్‌ను రూ.8 వేలకు విక్రయిస్తున్నాయి. మైక్రోమ్యాక్స్ యూ యురేకా రూ.8,999లకు అమెజాన్ లో లభిస్తోంది.

కొద్ది రోజుల్లో సెల్‌కాన్ 4జీ స్మార్ట్‌ఫోన్లలోకి అడుగు పెడుతోంది. రూ.10 వేలలోపు మోడల్‌ను తెస్తున్నట్లు కంపెనీ సీఎండీ వై.గురు ‘సాక్షి’తో చెప్పారు. తాము సైతం పోటీలో ఉంటామని హువాయి డెరైక్టర్ పి.సంజీవ్ ప్రకటించారు. లెనోవో ఏ6000 మోడల్‌ను రూ.8 వేల లోపే తెచ్చే ప్రయత్నాల్లో ఉంది. ఏసర్ లిక్విడ్ జడ్410 రూ.10 వేలలోపే ఉండనుంది. ఆసస్, కార్బన్ కూడా పోటీకి దిగుతున్నాయి. ఇక ఆపిల్, శాంసంగ్, ఎల్‌జీ, ఒపో, లెనోవో, హెచ్‌టీసీ తదితర కంపెనీలు ఇప్పటికే పలు 4జీ మోడళ్లను విక్రయిస్తున్నాయి.

ఇదీ 4జీ టెక్నాలజీ ప్రత్యేకత...
* ప్రస్తుతం ఎక్కువ శాతం టెలివిజన్ చానెళ్లకు 2ఎంబీ లైన్లలో డేటా ట్రాన్స్‌ఫర్ జరుగుతోంది. వైర్‌లెస్ 4జీ అందుబాటులోకి వస్తే ఫోన్ల నుంచి నేరుగా చానెళ్లకు డేటా పంపించుకోవచ్చు.
* హైస్పీడ్ కారణంగా టెలికాన్ఫరెన్సింగ్, మెడికల్ కాన్ఫరెన్సింగ్, వర్చువల్ క్లాస్‌రూమ్‌లు తదితర అవసరాలకు 3జీలో ఎదురవుతున్న ఇబ్బందులు 4జీలో ఉండవు. ప్రధానంగా స్పీడ్‌కు సంబంధించి 4జీ-3జీ మధ్య ఉండే తేడాలు చూస్తే...

మరిన్ని వార్తలు