ఎన్‌సీఎల్‌టీ ముందుకు వీడియోకాన్‌

7 Jun, 2018 01:01 IST|Sakshi

దివాలా చట్టం కింద కేసు నమోదు

ముంబై: దివాలా చట్టం (ఐబీసీ) కింద వీడియోకాన్‌ ఇండస్ట్రీస్‌ కేసును జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) బుధవారం నమోదు చేసుకుంది. ఈ కేసులో మధ్యంతర పరిష్కార నిపుణుడిగా కేపీఎంజీకి చెందిన అనుజ్‌జైన్‌ను నియమించింది. 180 రోజుల్లోగా కంపెనీని జైన్‌ టర్న్‌ అరౌండ్‌ చేయాల్సి ఉంటుంది. అదనంగా మరో 90 రోజుల కాల వ్యవధి కోరవచ్చు. అప్పటికీ ఫలితం లేకుంటే కంపెనీ ఆస్తుల్ని వేలం వేస్తారు. కంపెనీకి వ్యతిరేకంగా దాఖలైన అన్ని దివాలా కేసులనూ కలిపి విచారించాలని ఎన్‌సీఎల్‌టీ ప్రిన్సిపల్‌ బెంచ్‌ను ఈ ఏడాది ఏప్రిల్‌లో వీడియోకాన్‌ ఆశ్రయించింది. ఇందుకు ఎన్‌సీఎల్‌టీ అంగీకరించిందని వీడియోకాన్‌ చైర్మన్‌ వేణుగోపాల్‌ ధూత్‌ చెప్పారు.

మొత్తం రూ.20,000 కోట్ల రుణాల్లో 70– 80 శాతం వరకు బ్యాంకులు వసూలు చేసుకోగలవన్నారు. మొత్తం ప్రక్రియ ఎలాంటి అవాంతరాల్లేకుండా 180 రోజుల్లోపు ముగిసిపోవాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ‘‘ముందుగా మూలధన అవసరాలను పరిష్కరించాలి. రుణదాతలందరి ప్రయోజనాల పరిరక్షణ బాధ్యతను దివాలా పరిష్కార నిపుణుడు తీసుకోవాలి. దీనికి మా సహకారం ఉంటుంది. కంపెనీకి చాలా ఆస్తులున్నాయి. విదేశీ చమురు క్షేత్రాల్లోనూ వాటాలు ఉన్నాయి. పెరుగుతున్న ముడి చమురు ధరలు మా గ్రూపునకు మంచివే’’ అని ధూత్‌ వివరించారు.  

మరిన్ని వార్తలు