ఉత్తరప్రదేశ్‌లో మేఘా భారీ ప్రాజెక్టు పూర్తి

8 Feb, 2018 00:52 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మౌలిక రంగ సంస్థ మేఘా ఇంజనీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఉత్తర ప్రదేశ్‌లో ఓ భారీ పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేసింది. దేశంలో తొలిసారిగా అత్యాధునిక గ్యాస్‌ ఇన్సులేటెడ్‌ సబ్‌స్టేషన్‌ టెక్నాలజీని దీనికోసం వాడారు. 13,220 మెగా వోల్ట్‌ ఆంపియర్‌ విద్యుత్‌ను సరఫరా చేసే సామర్థ్యం దీని సొంతం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రెండు రాష్ట్రాల విద్యుత్‌ సరఫరా సామర్థ్యానికి ఇది సమానమని కంపెనీ ఈ సందర్భంగా తెలియజేసింది.

దేశంలో ప్రైవేటు రంగంలో ఈ స్థాయిలో నిర్మించిన తొలి ప్రాజెక్టు ఇదే కావడం విశేషం. బిల్డ్, ఓన్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్‌ ప్రాతిపదికన చేపట్టిన ఈ కాంట్రాక్టు విలువ రూ.4,150 కోట్లు. ఈ ప్రాజెక్టును వెస్టర్న్‌ ఉత్తర ప్రదేశ్‌ పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ కంపెనీ (డబ్ల్యూయుపీపీటీసీ) నుంచి మేఘా ఇంజనీరింగ్‌ దక్కించుకుని 2011లో నిర్మాణాన్ని ప్రారంభించింది. 35 ఏళ్లపాటు నిర్వహణ బాధ్యతను మేఘా చేపడుతుంది. దీనిద్వారా పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లోని ఏడు జిల్లాలకు విద్యుత్‌ సరఫరా చేస్తారు. ప్రాజెక్టు నిర్మాణంలో 200 మంది సాంకేతిక నిపుణులు, 2,000లకు పైగా కార్మికులు పాలుపంచుకున్నట్లు కంపెనీ తెలియజేసింది.

>
మరిన్ని వార్తలు