ఐదేళ్లలో డిజిటల్‌ మీడియాదే ఆధిపత్యం!

14 Mar, 2017 04:44 IST|Sakshi
ఐదేళ్లలో డిజిటల్‌ మీడియాదే ఆధిపత్యం!

మూడేళ్లలో రూ.20,000 కోట్లకు డిజిటల్‌ మార్కెట్‌: ఈవై ఇండియా

ముంబై: స్మార్ట్‌ఫోన్లు, బ్రాడ్‌బ్యాండ్‌ వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో 2021–22 నాటికి డిజిటల్‌ మీడియా.. ఇతర సంప్రదాయ మాధ్యమాలను అధిగమిస్తుందని కన్సల్టెన్సీ సంస్థ ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ (ఈవై) ఇండియా అంచనా వేసింది. 2019–20 నాటికి జనాభాలో 50 శాతం మంది స్మార్ట్‌ఫోన్‌లను వినియోగించనుండటం ఇందుకు తోడ్పడగలదని వివరించింది. అలాగే, 2021–22 నాటికి స్మార్ట్‌ఫోన్ల వాడకంలో మూడో వంతుకి బ్రాడ్‌బ్యాండ్‌ వినియోగం చేరుతుందని, ఈ రెండు సర్వీసుల వ్యయాల మధ్య వ్యత్యాసం ఒక మోస్తరు స్థాయికి రాగలదని తెలిపింది.

వీటన్నిటి ఊతంతో డిజిటల్‌ మీడియా వినియోగం గణనీయంగా పెరుగుతుందని ఈవై ఇండియా అడ్వైజరీ లీడర్‌ (మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగం) ఆశీష్‌ ఫేర్వానీ తెలిపారు. మార్కెట్‌ రీసెర్చ్‌ సంస్థ ఈ–మార్కెటర్‌ అంచనా ప్రకారం భారతీయులు ప్రతి రోజు సంప్రదాయ మీడియా (టీవీ, రేడియో, వార్తాపత్రికలు, మ్యాగజైన్లు)పై సగటున రెండున్నర గంటలు, డిజిటల్‌ మీడియాపై ఒక గంట మేర సమయం వెచ్చిస్తున్నారు. ‘2020–21 నాటికి ఈ ధోరణి మారుతుంది. 2021–22 కల్లా డిజిటల్‌ వినియోగం భారీగా పెరిగి, సంప్రదాయ మీడియా వాడకం గణనీయంగా తగ్గిపోతుంది‘ అని పేర్కొన్నారు.

ముందుగా ముప్పు ఇంగ్లిష్‌ మీడియాకే..
పై స్థాయి వర్గాలు వేగంగా డిజిటల్‌ వైపు మళ్లుతుండటంతో సంప్రదాయ మాధ్యమంలో ముందుగా ఇంగ్లీష్‌ ప్రింట్‌ మీడియాకే ముప్పు పొంచి ఉందని ఆశీష్‌ చెప్పారు. ప్రాంతీయ భాషల్లో ప్రింట్‌ సర్క్యులేషన్‌ పెరుగుతోందని, ఇది మరింత వృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని ఆయన వివరించారు. ప్రస్తుతం రూ. 8,490 కోట్లుగా ఉన్న దేశీ డిజిటల్‌ మార్కెట్‌ (డిజిటల్‌ అడ్వర్టైజింగ్, మ్యూజిక్, వీడియోలు, గేమింగ్‌ మొదలైనవి) వచ్చే మూడేళ్లలో రూ. 20,000 కోట్లకు చేరనుందని పరిశ్రమవర్గాల అంచనా.

మరిన్ని వార్తలు