సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోనూ, విదేశాల్లోనూ దాగున్న నల్లధనం వివరాలు బహిర్గతం కానున్నాయి. నల్లధనానికి చెందిన మూడు అధ్యయన రిపోర్టులను ఆర్థికమంత్రిత్వ శాఖ, పార్లమెంట్ ప్యానల్కు పంపించింది. మూడేళ్ల తర్వాత ఈ రిపోర్టులను ప్రభుత్వానికి సమర్పించినట్టు అధికారులు చెప్పారు. యూపీఏ హయాంలోనే ఢిల్లీకి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లయిడ్ ఎకనామిక్ రీసెర్చ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్సియల్ మేనేజ్మెంట్ ఫరిదాబాద్లు ఈ అధ్యయనాన్ని చేపట్టాయి.
ఈ మూడు సంస్థలు ప్రస్తుతం ఫైనాన్స్ స్టాండింగ్ కమిటీకి తమ రిపోర్టులు అందించాయని అధికారులు తెలిపారు. ఒక్కసారి కమిటీ కూడా వీటిని క్లియర్చేసిన అనంతరం, ఇవి పార్లమెంట్ ముందుకు రానున్నాయి. ప్రస్తుతం భారత్లో, విదేశాల్లో ఎంత నల్లధనం ఉందో అధికారికంగా వెల్లడించలేదు. కానీ అమెరికాకు చెందిన గ్లోబల్ ఫైనాన్సియల్ ఇంటిగ్రిటీ అధ్యయనం ప్రకారం 2005-14 కాలంలో 770 బిలియన్ డాలర్ల నల్లధనం భారత్లోకి ప్రవేశించిందని పేర్కొంది.