మూడో విడత ఉడాన్‌ రూట్ల వేలం

6 Nov, 2018 01:57 IST|Sakshi

ముంబై: చిన్న పట్టణాలకు చౌక విమాన సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ఉద్దేశించిన ఉడాన్‌ స్కీమ్‌ కింద కేంద్ర ప్రభుత్వం మూడో విడతలో రూట్ల వేలానికి బిడ్లను ఆహ్వానించింది. ప్రాథమిక బిడ్లను డిసెంబర్‌ 10లోగా ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ)కు సమర్పించాల్సి ఉంటుంది. రూట్లను దక్కించుకున్న ఎయిర్‌లైన్స్‌ పేర్లను జనవరి 7 లోగా ప్రకటించడం జరుగుతుంది. వేలంలో పాల్గొనాలని భావిస్తున్న బిడ్డర్ల కోసం నవంబర్‌ 6న ప్రి–బిడ్‌ సమావేశం ఉంటుంది.

ఇందుకు సంబంధించిన వివరాలను ఆర్‌సీఎస్‌ పోర్టల్‌లో ఉంచారు. ప్రధానంగా పర్యాటక ఆకర్షణ ఉండే ప్రాంతాలపై ఈ విడతలో దృష్టి సారిస్తున్నట్లు పౌర విమానయాన శాఖ సంయుక్త కార్యదర్శి ఉషా పధీ తెలిపారు. 2016 మార్చిలో ప్రకటించిన ఉడాన్‌ స్కీమును ఏఏఐ అమలు చేస్తోంది. పెద్ద సంఖ్యలో రూట్లను వేలం వేసినా, ఇప్పటికీ ఆశించినంత స్థాయిలో కనీసం సగం రూట్లలో కూడా  సర్వీసులు అందుబాటులోకి రాలేదని విమర్శలు ఉన్నాయి. ఈ స్కీము కింద గంట ప్రయాణ దూరాలకు గరిష్టంగా రూ. 2,500 చార్జీ ఉంటుంది.

మరిన్ని వార్తలు