మరో బ్యాడ్‌న్యూస్‌: విప్రో ఉద్యోగుల ఆశలు ఆవిరేనా? పిడుగు లాంటి నివేదిక!

9 Nov, 2023 18:26 IST|Sakshi

Wipro salary hike: దేశీయ ఐటీ దిగ్గజం విప్రో తమ ఉద్యోగులకు షాకుల మీద షాకులిస్తోంది. ఇంటి పని చేస్తున్న ఉద్యోగులందరూ ఆఫీస్‌లకు రావాల్సిందేనని ఇటీవల ఆదేశాలు జారీ చేసిన కంపెనీ ఇప్పుడు జీతాల పెంపు విషయంలో ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు పిడుగు లాంటి నివేదికను రాయిటర్స్‌ బయటపెట్టింది.

విప్రో సంస్థ పనితీరు ఆధారంగా ఇచ్చే వేతన పెంపు విషయంలో ఈ సంవత్సరం అధిక ప్యాకేజీ ఉద్యోగులకు మొండిచేయి చూపిస్తుందని, వారికి వార్షిక వేతన పెంపును దాటవేయవచ్చని రాయిటర్స్ తాజాగా నివేదించింది. ఈ కంపెనీలో డిసెంబర్ నెలలో వేతన సవరణలు జరగాల్సి ఉంది. డిసెంబర్ 1న ఉద్యోగులు పెరిగిన జీతాలు   అందుకుంటారని కంపెనీ యాజమాన్యం తమ 2023-24 రెండో త్రైమాసిక ఫలితాల సందర్భంగా ప్రకటించింది.

తక్కువ ప్యాకేజీ ఉద్యోగులకు ఊరట
నివేదిక ప్రకారం.. విప్రో కంపెనీ జీతాల పెంపును పూర్తిగా విరమించుకోలేదు.  తక్కువ ప్యాకేజీ ఉన్న ఉద్యోగులకు మాత్రమే వేతన పెంపును అమలు చేయబోతోంది. వేతన పెంపులో తక్కువ ప్యాకేజీ ఉద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు పేర్కొన్న కంపెనీ అంతర్గత మెమోను రాయిటర్స్‌ ఉటింకించింది.

ఆఫీస్‌కు రావాల్సిందే..
ఉద్యోగులు వారానికి మూడు రోజులు తప్పనిసరిగా ఆఫీస్‌కు రావాల్సిందేనని విప్రో ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. కొత్త వర్క్‌ పాలసీలో భాగంగా నవంబర్‌ 15 నుంచి ఉద్యోగులు కార్యాలయాల నుంచి పనిచేయాల్సి ఉంటుందని సిబ్బందికి పంపిన ఈమెయిల్స్‌లో పేర్కొంది. కొత్త వర్క్ పాలసీని అనుసరించకపోతే, వచ్చే ఏడాది జనవరి 7 నుంచి పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.

ఇదీ చదవండి: 70-hour work: అన్నేసి గంటలేంటి? ‘సిల్లీ’కాకపోతే: ప్రముఖ కంపెనీ అధినేత్రి కౌంటర్‌!

మరిన్ని వార్తలు