ఆంధ్రప్రదేశ్‌లో మహీంద్రా రిసార్ట్‌!

12 Dec, 2017 01:09 IST|Sakshi

మహీంద్రా హాలిడేస్‌ అండ్‌ రిసార్ట్స్‌ ఎండీ, సీఈఓ కవిందర్‌ సింగ్‌

పరిశీలనలో ఉంది; ప్రయత్నాలు చేస్తున్నాం  

కొత్త రిసార్టులు, విస్తరణపై రూ.600 కోట్లు

10 ఏళ్ల సభ్యత్వం, సొంత నగరాల్లో హాలిడే ఈవెంట్లపై దృష్టి... డీమోనిటైజేషన్‌ వల్ల మాకు లాభమే  

‘డిజిటల్‌’లోనూ మేం ముందున్నాం...

 మరిన్ని విదేశీ రిసార్టుల కొనుగోళ్లకు రెడీ...

ప్రస్తుత యువ తరంగానికి ట్రెక్కింగ్, స్నో స్కీయింగ్, పారాగ్లైడింగ్, రాక్‌ క్లైంబింగ్, జంగిల్‌ సఫారీ లాంటి సాహసకృత్యాలంటే చాలా మక్కువ. ఇలాంటివన్నీ సాకారం చేస్తూ.. విహార, పర్యాటక రంగంలో దూసుకెళుతున్న మహీంద్రా హాలిడేస్‌ అండ్‌ రిసార్ట్స్‌.. విస్తరణకోసం భారీగానే ప్రణాళికలు వేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా రిసార్ట్‌ ఏర్పాటుపై దృష్టి పెట్టినట్లు కంపెనీ ఎండీ, సీఈఓ కవిందర్‌ సింగ్‌ చెప్పా రు.

ఇటీవలే ‘క్లబ్‌ మహీంద్రా’ కండాఘాట్‌ రిసార్ట్‌లో మీడియా ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమైన సందర్భంగా ‘సాక్షి, బిజినెస్‌ ప్రతినిధి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. నోట్ల రద్దు వల్ల పరిశ్రమకు నష్టం మాట అటుంచితే, తమకు ప్రయోజనాలే ఎక్కువగా జరిగాయని చెప్పారాయన. ఇంకా కంపెనీ విస్తరణ ప్రణాళికలు, విదేశీ కొనుగోళ్లతో పాటు కొత్త సభ్యత్వ ప్యాకేజీలు తదితర అంశాలను వివరంగా తెలిపారు. ఇంటర్వ్యూ ముఖ్యాంశాలివీ...


ప్ర: మీ లీజర్‌ హాలిడేయింగ్‌ (సరదా విహార యాత్రలు), పర్యాటక విభాగం ప్రస్తుతం ఎలా ఉంది? కొత్త ప్రాజెక్టులేమైనా తెస్తున్నారా?
ప్రస్తుతం ఉన్న ప్రాపర్టీల(రిసార్ట్‌) విస్తరణతోపాటు, ఈ రంగంలోని ఇతర సంస్థలతో భాగస్వామ్యాల రూపంలో మా వ్యాపారాన్ని శరవేగంగా ముందుకు తీసుకెళ్తున్నాం. గోవాలో రూ.230 కోట్లతో 240 గదులతో విశాలమైన రిసార్ట్‌ను అందుబాటులోకి తేబోతున్నాం. అష్టముడిలో రూ.100 కోట్లతో కొత్త ప్రాజెక్టును చేపట్టాం. దీనివల్ల 100 గదులు జతవుతాయి.

ఇంకా నాల్దెరాలో 55 గదులతో రిసార్ట్‌ తెరిచాం. రూ.100 కోట్ల పెట్టుబడితో 60 గదులను జత చేశాం. మొత్తంమీద ఈ మూడు కొత్త ప్రాజెక్టులపై రూ.600 కోట్ల వరకూ పెట్టుబడి పెడుతున్నాం. దీనివల్ల కొత్తగా సభ్యులకు 600 గదులు అందుబాటులోకి వస్తాయి. అలాగే సిమ్లా దగ్గర్లో కూడా మరో కొత్త రిసార్ట్‌ ప్రయత్నాల్లో ఉన్నాం.

ఇక 50 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్నవారి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ‘బ్లిస్‌’ పేరిట పదేళ్ల సభ్యత్వ స్కీమ్‌ను ప్రవేశపెడుతున్నాం. సొంత ప్రాంతాల్లో ఏడాదంతా వినూత్న హాలిడే అనుభూతిని ఆస్వాదించేందుకు ‘డ్రీమ్‌ స్కేప్స్‌’ ప్రోగ్రామ్‌ను కూడా తీసుకొస్తున్నాం. హాట్‌ఎయిర్‌ బెలూన్‌ రైడ్స్, వైన్‌యార్డ్స్‌ సందర్శన, యాట్‌ రైడ్స్‌ వంటివి ఇందులో ఉంటాయి. గతేడాదే మొబైల్‌ యాప్‌ను తెచ్చాం. ఇప్పుడు మా బుకింగ్స్‌లో 85 శాతం వరకూ వెబ్, యాప్‌ల ద్వారానే జరుగుతోంది.

ట్రెక్కింగ్, ఎకో టూరిజం వంటి ప్రత్యేకతలుండే లీజర్‌ పర్యాటకం దేశంలో ఎలా ఉంది? భవిష్యత్తు ఎలా ఉండొచ్చు?
భారతీయ సేవల రంగానికి బూస్ట్‌నిచ్చే రంగాల్లో పర్యాటక, ఆతిథ్య పరిశ్రమది ప్రధాన పాత్ర. లక్షలాది ఉద్యోగాల కల్పనతోపాటు దేశానికి వేల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా అందిస్తోంది. 2016లో మన జీడీపీకి ఈ పరిశ్రమ ప్రత్యక్షంగా 71.53 బిలియన్‌ డాలర్లను జతచేసింది.

ఇక్కడున్న గొప్ప సాంస్కృతిక, చారిత్రక, వారసత్వ సంపదకు తోడు.. సహజమైన ప్రకృతి రమణీయ ప్రదేశాలు కూడా మన పర్యాటక పరిశ్రమ వృద్ధికి దన్నుగా నిలుస్తున్నాయి. దాదాపు భారతీయ పర్యాటక రంగంలో 83 శాతం వరకూ దేశీయంగానే ఉంది. అందుకే మేం ఇండియాలోనే అత్యధికంగా పెట్టుబడులు పెడుతున్నాం. మాకున్న 53 రిసార్టుల్లో 48 ఇక్కడే ఉన్నాయి.

అయితే, విదేశీ పర్యటనలకు వెళ్లేవారిక్కూడా అందుబాటులో ఉండటానికి ఇతర రిసార్టులు, హోటల్‌ నెట్‌వర్క్‌లతో జతకట్టి.. మంచి ప్యాకేజీలను అందిస్తున్నాం. యువత కూడా తమ స్నేహితులతో, కుటుంబాలతో టూర్లకు ముందుంటున్నారు. ఇప్పటివరకూ ఎవరికీ పెద్దగా తెలియని ప్రాంతాలను చూసొచ్చేందుకు మక్కువ చూపుతున్నారు. అందుకే అలాంటి పర్యాటక గమ్యస్థానాల్లో రిసార్టుల విస్తరణపై దృష్టిపెడుతున్నాం.

పెద్ద నోట్ల రద్దు కారణంగా మన పర్యాటక, ఆతిథ్య రంగంపై ప్రతికూల ప్రభావం పడిందంటారా? మీ సంగతేంటి?
డీమోనిటైజేషన్‌ వల్ల పరిశ్రమపై కొంత ప్రతికూల ప్రభావం పడినమాట నిజమే. కాకపోతే మాపై మాత్రం పడలేదు. నిజం చెప్పాలంటే మాకు దీనివల్ల ప్రయోజనమే ఎక్కువ. ఎందుకంటే క్రెడిట్‌ కార్డు చెల్లింపులు భారీగా పెరిగాయి. మేం నెలవాయిదాల (ఈఎంఐ) రూపంలో సభ్యత్వాలను విక్రయిస్తాం కాబట్టి.. మరింత మంది సభ్యులు కార్డు చెల్లింపులకు ముందుకొస్తున్నారు. డీమోనిటైజేషన్‌ కాలంలో మా అమ్మకాల్లో మంచి వృద్ధిని కూడా సాధించాం.

దక్షిణాదిలో మీకు అత్యధికంగా 18 రిసార్టులున్నాయి. మరి పర్యాటకానికి అవకాశమున్న ఏపీ, తెలంగాణల్లో ఒక్కటి కూడా లేదెందుకు?
దేశంలో మాకున్న భారీ నెట్‌వర్క్‌కు తోడుగా కొత్త పర్యాటక ప్రాంతాల్లో రిసార్టుల ఏర్పాటుపై ఎప్పటికప్పుడు అధ్యయనాలు, ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. ఆంధ్రప్రదేశ్‌లో రిసార్ట్‌ నెలకొల్పే అంశం మా పరిశీలనలో ఉంది. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం.

2014లో మీరు ఫిన్లాండ్‌కు చెందిన అతిపెద్ద రిసార్ట్‌ చైన్‌ ‘హాలిడే క్లబ్‌’ను చేజిక్కించుకున్నారు? మళ్లీ ఆ స్థాయిలో విదేశీ కొనుగోళ్లపై దృష్టి పెడుతున్నారా?
హాలిడే క్లబ్‌కు ఫిన్లాండ్, స్పెయిన్, స్వీడన్‌లలో 32 పైగా రిసార్టులు (2,800 గదులు) ఉన్నాయి. దీనికి భారత్‌లోని రిసార్టులను కూడా కలిపితే మొత్తం సభ్యత్వాల సంఖ్య ఇప్పుడు 2,25,000కు పైనే ఉంటుంది. గడిచిన 9 క్వార్టర్లలో సగటున 3,500కు పైగా మెంబర్లు జతయ్యారు. మాకు లీజ్డ్, సొంత ప్రాపర్టీలు రెండూ ఉన్నాయి.

గతేడాది ట్రావెల్‌ ఎక్స్‌పీరియన్సెస్‌ను ఆఫర్‌ చేసే ‘జోజోడే’ అనే స్టార్టప్‌లో పెట్టుబడి పెట్టాం. ఇంకా ప్రపంచస్థాయి క్రూయిజ్‌ (భారీ విహార నౌకలు) ప్యాకేజీలను అందించేందుకు అంతర్జాతీయ ట్రావెల్‌ అగ్రిగేటర్లతోనూ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాం. ఇంకా మాకున్న భారీ ల్యాండ్‌ బ్యాంక్‌లో భవిష్యత్తులో కొత్త రిసార్టుల నిర్మాణాన్ని పరి శీలిస్తున్నాం. శ్రీలంక, పశ్చిమ యూరప్, ఆగ్నేయాసియా, అమెరికాల్లో ప్రాపర్టీల లీజు లేదా పూర్తిగా కొనుగోలు ద్వారా విస్తరణ అవకాశాలపై దృష్టిపెడుతున్నాం.

సభ్యత్వాలు, కంపెనీ ఆదాయాల పరంగా మీ భవిష్యత్తు లక్ష్యాలేంటి?
ముందస్తు అంచనాలను మేం వెల్లడించం. అయితే, 2025కల్లా  పర్యాటకులకు అత్యంత అభిమాన వెకేషన్‌ ఓనర్‌షిప్‌ (రిసార్టుల సభ్యత్వం) కంపెనీగా ఎదగడంపై దృష్టి పెట్టాం. రిసార్టులన్నింటిలో మెంబర్లకు వినూత్న అనుభూతులను అందించేందుకు కొత్తకొత్త కార్యక్రమాలను తీసుకొస్తున్నాం. కొత్త, రిసార్టుల్లో నూతన స్కీమ్‌ల కోసం భారీగా పెట్టుబడులు పెట్టడం ద్వారా సభ్యుల సంఖ్యను పెంచుకోవాలనేది మా వ్యూహం.

– ఎం. శివరామకృష్ణ

మరిన్ని వార్తలు