వెండితెరపై చూసేది తక్కువే..!

19 Nov, 2015 00:33 IST|Sakshi
వెండితెరపై చూసేది తక్కువే..!

 బంపర్‌హిట్ అయినా చూసేది 2శాతమే
 టీవీల్లో వస్తే మాత్రం ఆ సంఖ్య రెట్టింపు
 50% మందికి స్క్రీన్లు అందుబాటులో లేవు
 చిన్న పట్టణాల్లో థియేటర్లు పెరగాలి
 మల్టీఫ్లెక్స్ సీఈఓల మాట

 
 కొచ్చి: ఒకప్పుడు... సినిమా ఎన్ని రోజులు ఆడితే అంత పెద్ద హిట్ అయినట్లు. మరిప్పుడు...! ఎన్ని రోజులు ఆడిందని కాదు... ఎన్ని సెంటర్లలో ఆడింది... ఎంత వసూలు చేసిందన్నదే కమర్షియల్ హిట్‌కు కొలమానం. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే... తొలి వీకెండ్ షేర్‌ను ఏ సినిమా అయితే అధికంగా రాబడుతుందో అది ఇండస్ట్రీ హిట్ల జాబితాలో చేరిపోతోంది. అయితే ఇక్కడొక బేసిక్ విషయాన్ని మరచిపోకూడదు. పెట్టిన పెట్టుబడిని వెనక్కు తీసుకొచ్చి, లాభాలను ఇచ్చే సినిమానే హిట్ సినిమాగా పరిగణిస్తారు.
 
  అదీ కథ. నిజానికి సినిమా ఫలితాన్ని నిర్ణయించే అంశాలు క్రమంగా మారుతున్నాయి. ప్రస్తుతం కలెక్షన్లే ఫలితాన్ని శాసిస్తున్నాయి. కాకపోతే ఆ కలెక్షన్లను అందించే ప్రేక్షకులు సినిమా హాళ్లకు వెళ్లి చూస్తున్నది తక్కువేనని, టీవీల్లోనే బాగా చూస్తున్నారనేదే తాజా వార్త. దీనికి ప్రధాన కారణం వారికి అందుబాటులో థియేటర్లు లేకపోవటమేనన్నది మల్టీప్లెక్స్ చైన్‌ల సీఈఓల మాట. అందుబాటులో ఉంటే వారు కూడా హాళ్లలోనే చూస్తారంటున్నారు కూడా.
 
 టీవీల్లో ప్రీమియర్ షోకు రెట్టింపు...
 ఇటీవల కాలంలో ‘భజరంగీ భాయీజాన్’ సినిమా మంచి హిట్‌ను సొంతం చేసుకుంది. భారత్‌లో రూ.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. కానీ ఆ సినిమాను థియేటర్లలో చూసిన ప్రేక్షకుల సంఖ్య మన దేశ జనాభాలో కేవలం 2 శాతమేనని (3.21 కోట్ల మంది) థియేటర్ చైన్ కార్నివాల్ సీఈఓ పి.వి.సునీల్ చెప్పారు. ఇదే సినిమా టీవీలలో గత నెలలో ప్రీమియర్ షోగా వస్తే 7.45 కోట్ల మంది వీక్షించారు. థియేటర్లలో 2 శాతం మంది చూస్తేనే రూ.300 కోట్లు వచ్చిందని, ఈ సంఖ్యను 5 శాతానికి పెంచగలిగితే భారతీయ సినీ పరిశ్రమ ఆదాయం గణనీయంగా పెరుగుతుందని కార్నివాల్ సినిమాస్‌కు డెరైక్టరుగా కూడా ఉన్న సునీల్ అభిప్రాయపడ్డారు.
 
 మార్కెట్ ఉన్నా.. రాబడి అంతంతే..
 సినిమాల పంపిణీకి భారత్‌లో భారీ మార్కెట్టే ఉందని కూడా సునీల్ అభిప్రాయపడ్డారు. ‘‘మార్కెట్టే కాదు. ఇక్కడ నిర్మిస్తున్న సినిమాల సంఖ్య కూడా ఎక్కువే. కానీ అధిక వసూళ్లను రాబట్టడంలో మాత్రం మనం విఫలమౌతున్నాం. దీనిక్కారణం ప్రస్తుతం దేశంలో 50 శాతం మంది ప్రజలకు సినిమాలు చూసే సదుపాయాలు అందుబాటులో లేకపోవడమే’’ అని సునీల్ వివరించారు. ‘దేశంలోని మొత్తం థియేటర్లలో మల్టీప్లెక్స్‌ల వాటా కేవలం 15 శాతం. మిగిలినవన్నీ సింగిల్ థియేటర్లే. అమెరికాలో 10 లక్షల మంది జనాభాకు 100 స్కీన్లు అందుబాటులో ఉంటే.. అదే మన దేశంలో 7 స్కీన్లు అందుబాటులో ఉన్నాయి’ అని చెప్పారాయన.
 
 చిన్న పట్టణాలే టార్గెట్..
 టైర్-2, టైర్-3, టైర్-4 పట్టణాలను లక్ష్యంగా చేసుకుంటే.. ఎక్కువ మంది ప్రేక్షకులను థియేటర్లకు రప్పించవచ్చని సినీపోలిస్ ఇండియా బిజినెస్ హెడ్ దేవాంగ్ సంపత్ అభిప్రాయపడ్డారు. దీంతో సినీ పరిశ్రమ ఆదాయం కూడా పెరుగుతుందన్నారు. తాము ఇటీవల పాట్నాలో 4 తెరల మల్టీప్లెక్స్‌ను ప్రారంభించామని, ప్రేక్షకుల ఆదరణ బాగుందని తెలియజేశారు. ‘‘చిన్న పట్ట ణాల్లోని ప్రజలు కూడా సినిమా చూడటం కోసం బాగానే వెచ్చిస్తున్నారు. అయితే మధ్యప్రదేశ్ వంటి ప్రాంతాల్లో ప్రజలు సినిమా చూడాలంటే 50 కిలోమీటర్లమేర ప్రయాణించాల్సి వస్తోంది. వారి దగ్గరికే సినిమా థియేటర్‌ను తీసుకెళ్తే పరిస్థితిలో మార్పు వస్తుంది. ఎందుకంటే భారతీయులు సినిమా చూసేది కేవలం వినోదం కోసమే కాదు. అది వారి సంస్కృతిలో భాగం’’ అన్నారాయన.
 
 ప్రేక్షకులను ఆకర్షిస్తున్న టెక్నాలజీ
 ప్రజలను థియేటర్లకు రప్పించడంలో టెక్నాలజీ కూడా కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు ఏరీస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సీఈవో, ఏరీస్‌ప్లెక్స్ ఎస్‌ఎల్ సినిమాస్ చీఫ్ ప్రమోటర్ సోహన్ రాయ్. ‘‘ఈ విషయాన్ని ఇటీవల విడుదలైన బాహుబలి సినిమా నిజం చేసింది. ఈ సినిమా మా 4కే ప్రొజెక్షన్ థియేటర్లలో వరుసగా 15 వారాలు హౌస్‌ఫుల్ కలెక్షన్లతో నడిచింది. ప్రేక్షకులు సినిమా చూడటంలో థియేటర్ కూడా తన వంతు పాత్రను పోషిస్తుంది’’ అని వివరించారాయన.
 

మరిన్ని వార్తలు