‘ఫేస్‌బుక్‌’లో కొత్తగా నియామకాలు

12 Oct, 2019 17:35 IST|Sakshi

సోషల్‌ మీడియా దిగ్గజం ‘ఫేస్‌బుక్‌’ ఇంగ్లండ్‌లో తన కార్యకలాపాలను విస్తరిస్తోంది. గత ఏడాది అక్కడి కార్యాలయంలో 1290 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, ఇటీవల వారి సంఖ్యను 1965కు పెంచింది. వారిలో ఒక్కొక్కరికి సగటున 117,170 (దాదాపు కోటీ ఐదు లక్షల రూపాయలు) పౌండ్ల చొప్పున మొత్తంగా 233.2 మిలియన్‌ (దాదాపు 2069 కోట్ల రూపాయలు) పౌండ్లను వేతనాల కింద చెల్లిస్తోంది. బ్రిటీష్‌ మాజీ డిప్యూటి ప్రధాన మంత్రి నిక్‌ క్లెగ్‌ను గత ఏడాది ప్రధాన లాబీయిస్ట్‌గా తీసుకున్న ఫేస్‌బుక్‌ యాజమాన్యం ఇంగ్లండ్‌లో ఉద్యోగుల నియామకానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. 

ఇంగ్లండ్‌ కార్యాలయంలో ఫేస్‌బుక్‌ ఉద్యోగులకు ఉచిత భోజనంతోపాటు కాసేపు కునుకు తీసేందుకు నిద్రపోయే ప్యాడ్స్‌ను కూడా ఉచితంగా అందజేస్తోంది. ఇతర రాయితీలను కూడా కొనసాగిస్తోంది. 2018లో ఫేస్‌బుక్‌ రెవెన్యూ 1.3 బిలియన్‌ పౌండ్ల నుంచి 1.7 పాండ్లకు పెరగడంతో కార్యకలాపాల విస్తరణను చేపట్టింది. అంతకుముందు 15.8 మిలియన్‌ పౌండ్ల పన్నులను చెల్లించిన కంపెనీ ఆ తర్వాత ఏడాది లాభాలు పెరిగినా 1.9 మిలియన్‌ పౌండ్లను తగ్గించి చెల్లింపులు జరపడం ఏమిటని ఆర్థిక నిపుణులు విమర్శిస్తున్నారు. 

కంపెనీ విస్తరణ కార్యక్రమాల వల్ల పన్నుల్లో రాయతీలు లభిస్తాయని అందుకని పన్ను భారం తగ్గిందని కంపెనీ యాజమాన్యం చెబుతోంది. 2020 నాటికి ఉద్యోగుల సంఖ్య మూడు వేలకు చేరుకుంటుందని ఉత్తర యూరప్‌ కంపెనీ కార్యకలాపాల వైస్‌ ప్రెసిడెంట్‌ స్టీవ్‌ హాచ్‌ తెలిపారు. ఏదీ ఏమైనా కంపెనీ లాభాలు పెరిగినప్పుడు అందుకు అనుగుణంగా అదనపు పన్ను చెల్లించాల్సిందేనని పన్నులకు సంబంధించిన పార్లమెంట్‌ గ్రూప్‌కు చైర్మన్‌గా వ్యవహరిస్తున్న మార్గరెట్‌ హోడ్జ్‌ కంపెనీకి ట్వీట్‌ చేశారు. 

మరిన్ని వార్తలు