పండగ వేళ కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లి ధరలు - రానున్న రోజుల్లో..

12 Nov, 2023 16:55 IST|Sakshi

ప్రతి ఏటా ఉల్లి ధరలు భారీగా పెరగడం, తగ్గడం జరుగుతూ ఉంటాయి. ఈ సంవత్సరం కూడా పండుగ సీజన్‌లో ఉల్లి ధరలు గణనీయంగా పెరిగాయి. కొన్ని నెలల క్రితం కేజీ ఉల్లి ధరలు రూ. 10 నుంచి రూ. 20 వరకు మాత్రమే ఉండగా.. ప్రస్తుతం అదే ఉల్లి ఢిల్లీలో రూ.70కి చేరింది. రానున్న రోజుల్లో ఇది రూ. 100కి చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఉల్లి ధరల పెరుగుదలకు కారణం ఏంటి? దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఉల్లి ధరల పెరుగుదలకు చాలా కారణాలు ఉన్నాయి. ఇందులో మొదటిది డిమాండ్. డిమాండ్ పెరిగినప్పుడు అవసరమైనన్ని అందుబాటులో లేనప్పుడు తప్పకుండా ధరలు పెరుగుతాయి. అంతే కాకుండా కొందరు రైతులు తమ పంటను అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేయడం వల్ల, దేశంలో ఉల్లి కొరత ఏర్పడి ధరలు పెరుగుతాయి.

ఉల్లి ధరలు పెరగటానికి మరో ప్రధానమైన కారణం పంట ఆలస్యం. ఖరీఫ్ పంట ఆలస్యం వల్ల సాగులో జాప్యం ఏర్పడుతుంది. అప్పుడు చేతికి అందాల్సిన సమయానికి పంట రాకపోతే కొరత ఏర్పడుతుంది. తద్వారా ధరలు పెరుగుదల జరుగుతుంది.

ఉల్లి ధరలు తగ్గించడానికి ప్రభుత్వం ఏం చేస్తుందంటే?
ఉల్లి ధరలు అందుబాటు ధరలు ఉంచాలనే ఉద్దేశ్యంతో గత ఆగస్టు నుంచి పెద్ద మొత్తంలో ఉల్లిపాయలను మార్కెట్లోకి విడుదల చేసినట్లు వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి 'రోహిత్ కుమార్ సింగ్' వెల్లడించారు. ధరల పెరుగుదలను నివారించడానికి ప్రభుత్వం రిటైల్ పంపిణీని కూడా పెంచుతున్నట్లు పేర్కొన్నారు. 

ఇదీ చదవండి: ప్రపంచంలో ఎక్కువ మంది డౌన్‌లోడ్ చేసుకున్న పాపులర్ యాప్స్ ఇవే! మీకు తెలుసా?

నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ (ఎన్‌సిసిఎఫ్), నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (నాఫెడ్) ద్వారా కేజీ ఉల్లి ధరలను రూ. 25కే అందుబాటులో ఉంచుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ 5 లక్షల టన్నుల ఉల్లి స్టాక్‌ను నిర్వహిస్తోంది, రాబోయే రోజుల్లో అదనంగా 2 లక్షల టన్నుల ఉల్లిపాయలను సేకరించాలని భావిస్తున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు