బ్యాంకులతో ఆర్‌బీఐ భేటీ : ఎజెండా ఏంటి?

2 May, 2020 10:35 IST|Sakshi

 బ్యాంకుల చీఫ్ లతో ఆర్‌బీఐ  గవర్నరు శక్తికాంత దాస్  సమీక్ష

సాక్షి, ముంబై : కరోనా వైరస్ సంక్షోభ  మధ్య  రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ శనివారం పలు బ్యాంకుల ముఖ్య అధికారులతో సమావేశం కానున్నారు.  ఆర్థిక రంగాన్ని,  పరిశ్రమను బలోపేతం చేయడానికి తీసుకోవలసిన చర్యలపై ఆయన చర్చించనున్నారు. ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి తీసుకోవలసిన చర్యలపై బ్యాంక్  చీఫ్ ల సలహాలను శక్తి కాంత దాస్ కోరనున్నారు.  కరోనా వైరస్ కష్టకాలంలో వాయిదాలు చెల్లించేందుకు ఆర్‌బీఐ మూడు నెలల పాటు మారటోరియానికి సంబంధించి మార్చి 27 నాటి మార్గదర్శకాల కనుగుణంగా కచ్చితంగా అమలయ్యేలా చూడాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఆర్‌బీఐ తాజా సమావేశం  ప్రాధాన్యతను సంతరించుకుంది.

వడ్డీ రేట్ల నియంత్రణ, ఇది వినియోగదారులకు చేరడం, పరిశ్రమలకు లాభించే లిక్విడిటీ ఇన్ఫ్యూషన్ చర్యలు వంటి ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ  చర్యలపై  శక్తికాంత్ దాస్ చర్చించనున్నారు. దీంతోపాటు సూక్ష్మ, చిన్న మధ్య తరగతి పరిశ్రమ, గ్రామీణ రంగానికి అందించిన సౌకర్యాలుపై సమక్షించనున్నారు. రుణగ్రహీతలు, రుణదాతలు, మ్యూచువల్ ఫండ్స్ వంటి ఇతర సంస్థలు ఎదుర్కొంటున్నఒత్తిడిని అంచనా వేయడానికి ఆర్‌బీఐ అనేక చర్యలు తీసుకుంది. ఎప్పటికపుడు పరిస్థితిని అంచనా వేస్తూ మరిన్ని చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇచ్చింది. ద్రవ్య సంక్షోభాన్ని పరిష్కరించడానికి జీడీపీలో 3.2 శాతాన్ని ఆర్థిక వ్యవస్థలోకి ప్రవేశపెట్టింది.  ఈ క్రమంలో తాజా సమావేశంలో పై  బ్యాంకింగ్ వర్గాల్లో,  మార్కెట్లో వర్గాల్లో ఆసక్తి నెలకొంది. 

కాగా మరో రెండువారాలపాటు లాక్‌డౌన్ పొడగింపును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కోవిడ్ -19 కేసులు లేని ప్రాంతాల్లో సడలింపులతో ఆరెంజ్, గ్రీన్ జోన్ల రిస్క్ ప్రొఫైలింగ్ ఆధారంగా ఎంపిక చేసిన కార్యకలాపాల నిర్వహణకు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను జారీ చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు