సరికొత్త ఆఫర్‌ : ‘జియోఫై’ పై భారీ తగ్గింపు

3 Jul, 2018 08:25 IST|Sakshi
జియోఫై పోర్టబుల్‌ 4జీ రూటర్‌

ముంబై : రిలయన్స్‌ జియో రోజుకో కొత్త ఆఫర్తో వినియోగదారుల ముందుకు వస్తోంది. నిన్న కాక మొన్ననే జియో ఒప్పో మాన్‌సూన్‌ ఆఫర్‌ ప్రకటించిన రిలయన్స్‌, తాజాగా జియోఫై పోర్టబుల్‌ 4జీ రూటర్‌ విక్రయాలను పెంచడానికి సరికొత్త క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఈ ఆఫర్‌ కింద కస్టమర్లకు 500 రూపాయల క్యాష్‌బ్యాక్‌ లభించనుంది. దీంతో జియోఫై రూటర్‌ 499 రూపాయలకే అందుబాటులోకి వచ్చింది. గతేడాది సెప్టెంబర్‌లోనే ఈ పోర్టబుల్‌ రూటర్‌ ధరను రూ.1999 నుంచి రూ.999కు తగ్గించిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రకటించిన కొత్త క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ కేవలం కొత్త జియోఫై యూనిట్‌ కొనుగోలు చేసే యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఇప్పటికే ఈ డివైజ్‌ కలిగి ఉన్నవారికి ఈ ఆఫర్‌ వర్తించదు. జూలై 3 నుంచి అంటే నేటి నుంచి ఈ ఆఫర్‌ను యూజర్లకు జియో అందిస్తోంది. అయితే ఎప్పుడు వరకు ఈ ఆఫర్‌ యూజర్లకు అందుబాటులో ఉండనుందో కంపెనీ వెల్లడించలేదు. 

జియోఫై క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ యూజర్లు పొందడం కోసం, తొలుత యూజర్లు ఆ డివైజ్‌ను కొనుగోలు చేయాలి. దానిలో కొత్త పోస్టుపెయిడ్‌ సిమ్‌ను యాక్టివేట్‌ చేసుకోవాలి. కచ్చితంగా కనీసం 199 రూపాయల విలువైన పోస్టుపెయిడ్‌ ప్లాన్‌తో యూజర్లు రీఛార్జ్‌ చేయించుకోవాలి. ఇలా 12 నెలల పాటు రీఛార్జ్‌ చేయించుకుంటూనే ఉండాలి. 12 నెలల తర్వాత, తర్వాత బిల్‌ సైకిళ్లలో ప్రకటించిన 500 రూపాయల క్యాష్‌బ్యాక్‌ను రిలయన్స్‌జియో అందించనుంది. జియో తన పోస్టు పెయిడ్‌ ప్లాన్‌ రూ.199 కింద 25 జీబీ డేటాను, ఉచిత వాయిస్‌ కాల్స్‌ను, అపరిమిత ఎస్‌ఎంఎస్‌లను, జియో యాప్స్‌ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను పొందనున్నారు. కొత్త జియో ఒప్పో మాన్‌సూన్‌ ఆఫర్ ప్రకటించిన రోజుల్లోనే మరో ఆఫర్‌ను తీసుకొచ్చింది. మాన్‌సూన్‌ ఆఫర్‌ కింద 4,900 రూపాయల విలువైన ప్రయోజనాలను జియో తన ఒప్పో కస్టమర్లకు అందిస్తోంది. జూన్‌లో కూడా జియో తన ఎంపిక చేసిన ప్యాక్‌లకు రోజుకు 1.5 జీబీ అదనపు డేటాను యూజర్లకు ఆఫర్‌చేస్తోంది. 

>
మరిన్ని వార్తలు