టాటాలకు ‘సుప్రీం’ ఊరట

11 Jan, 2020 04:17 IST|Sakshi

 ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా మిస్త్రీ పునర్‌ నియామకపు ఉత్తర్వుపై స్టే

న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా సైరస్‌ మిస్త్రీని పునర్‌నియమించాలన్న ఎన్‌సీఎల్‌ఏటీ(నేషనల్‌ కంపెనీ లా అపీలేట్‌ ట్రిబ్యునల్‌) ఉత్తర్వులపై  సుప్రీంకోర్టు శుక్రవారం స్టే ఇచ్చింది. ట్రిబ్యునల్‌ ఇచ్చిన ఉత్తర్వు్యలను పూర్తి స్థాయిలో విచారించాల్సిన అవసరం ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది. కేసును మరోరోజు పూర్తిస్థాయిలో విచారణకు చేపట్టనున్నట్లు తెలిపింది.

ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్‌ బీఆర్‌ గవాయ్, జస్టిస్‌ సూర్యకాంత్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ముందు టాటా సన్స్‌ పిటిషన్‌ లిస్టయ్యింది.  2016లో అర్ధంతరంగా టాటా సన్స్‌ చైర్మన్‌ హోదా నుంచి ఉద్వాసనకు గురైన సైరస్‌ మిస్త్రీని పునర్‌నియమించాలంటూ 2019 డిసెంబర్‌ 18న ఎన్‌సీఎల్‌ఏటీ ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.

టీసీఎస్‌కు కూడా... 
కాగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) డైరెక్టర్‌గా సైరస్‌ మిస్త్రీని పునర్‌నియమించాలంటూ ఎన్‌సీఎల్‌ఏటీ ఇచ్చిన ఉత్తర్వులపై కూడా సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. కంపెనీ శుక్రవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.

17న కంపెనీ ఫలితాలు.. 
కాగా, టీసీఎస్‌ శుక్రవారం ఒక ప్రత్యేక ప్రకటన విడుదల చేస్తూ, జనవరి 17న డిసెంబర్‌ త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్నట్లు వివరించింది.

మరిన్ని వార్తలు