రూ.999కే 4జీ స్మార్ట్‌ఫోన్లు

24 Jan, 2018 15:57 IST|Sakshi

టెలికాం కంపెనీ వొడాఫోన్ ఇండియా‌, దేశీయ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యంలో ఎంట్రీ-లెవల్‌ స్మార్ట్‌ఫోన్లను అత్యంత తక్కువగా 999 రూపాయలకే ఆఫర్‌ చేయనున్నట్టు ఇరు కంపెనీలు పేర్కొన్నాయి. ఈ స్కీమ్‌ కొత్త, పాత వొడాఫోన్‌ ప్రీపెయిడ్‌ కస్టమర్లకేనని తెలిపాయి. 2018 మార్చి 31 వరకు ఈ ఆఫర్‌ వాలిడ్‌లో ఉండనుంది. ఈ స్పెషల్‌ ధరను అందిపుచ్చుకోవడానికి కస్టమర్లు ప్రతి నెలా కనీసం 150 రూపాయల రీఛార్జ్‌ను 36 నెలల పాటు చేయించుకోవాలి. ఏ డినామినేషన్‌లో రీఛార్జ్‌ చేయించుకున్నా.. నెల ఆఖరిని కనీసం 150 రూపాయలు రీఛార్జ్‌ అయి ఉండాలి. దీంతో 18 నెలల అనంతరం కస్టమర్లకు 900 రూపాయల క్యాష్‌బ్యాక్‌ లభించనుంది. మరో 18 నెలల అనంతరం 1,100 రూపాయల క్యాష్‌బ్యాక్‌ను కస్టమర్లు పొందనున్నారు. మొత్తంగా 2వేల రూపాయల మేర క్యాష్‌బ్యాక్‌ లభించనుంది. 

ఈ క్యాష్‌బ్యాక్‌ కస్టమర్ల వొడాఫోన్‌ ఎం-పైసా వాలెట్లలో క్రెడిట్‌ అవుతాయి. మైక్రోమ్యాక్స్‌, ఐవోమి, యు మొబైల్స్‌, ఇంటెక్స్‌, స్వైప్‌, ఆల్కాటెల్‌ వంటి పలు బ్రాండుల స్మార్ట్‌ఫోన్లకు వొడాఫోన్‌ క్యాష్‌బ్యాక్‌ను ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ అందిస్తోంది. రిలయన్స్‌ జియోను ఎదుర్కోవడానికి వొడాఫోన్‌ వేసిన ఎత్తుగడలో ఇదీ ఒకటి. కేవలం వొడాఫోన్‌ మాత్రమే కాక, ఇతర ఇంక్యుబెంట్‌ ఆపరేటర్లు కూడా స్మార్ట్‌ఫోన్లను ఎక్కువమందికి అందించడానికి హ్యాండ్‌సెట్‌ తయారీదారులతో భాగస్వామ్యం ఏర్పరుచుకుంటున్నాయి. టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ కూడా స్మార్ట్‌ఫోన్‌ తయారీదారుల భాగస్వామ్యంలో ఇదే రకమైన డీల్స్‌ను ఆఫర్‌ చేస్తోంది. ప్రస్తుతం ఎయిర్‌టెల్‌ డీల్స్‌, ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులో లేవు. 


 

మరిన్ని వార్తలు