కొణిదెనలో ఘర్షణ

4 Sep, 2019 08:32 IST|Sakshi
కొణిదెన గ్రామంలో విచారణ చేపడుతున్న దర్శి డీఎస్పీ, ఎస్సై, సిబ్బంది

ఇరు సామాజిక వర్గాలు ఫిర్యాదు

ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు

దర్శి డీఎస్పీ విచారణ

సాక్షి, బల్లికురవ (ప్రకాశం): పుట్టగొడుగుల కొనే విషయంలో తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసి రెండు సామాజిక వర్గాలు ఒకరిపై ఒకరు పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ ఘటన సోమవారం మండలంలోని కొనిదెన గ్రామంలో జరగ్గా మంగళవారం సాయంత్రం దర్శి డీఎస్పీ ప్రకాశరావు బీసీ, ఎస్సీ కాలనీలో విచారణ చేపట్టారు. అందిన సమాచారం ప్రకారం రాజుపాలెం గ్రామానికి చెందిన కొండలు కొణిదెన సెంటర్లో పుట్ట గొడుగులు అమ్ముతున్నాడు, ఎస్సీ కాలనీకి చెందిన జండ్రాజుపల్లి ముత్తయ్య, రాజేష్‌ బేరం చేసి పుట్టగొడుగులు కొనుగోలు చేశాడు, అయితే కొండలుకు డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్‌ పల్లపు సురేష్‌ డబ్బులు ఇస్తే ఇవ్వండి లేకుంటే లేదు అనే విషయంలో సురేష్‌ ముత్తయ్య రాజేష్‌ల మధ్య మాటామాటా పెరిగింది.

సమీపంలో ఉన్నవారు ఇరువురి సర్ది చెప్పి పంపారు. ఆ తదుపరి ముత్తయ్య, రాజేష్, లోక్‌ష్‌లు మారణాయుధాలతో బీసీ కాలనీలోకి వచ్చారు. కాలనీ వాసులు గతంలో ఉన్న పాత కక్షలు దృష్టిలో పెట్టుకుని భయపడి ముగ్గురిని నిర్భంధించారు. తమపై దాడిచేశారని  ముత్తయ్య, తన్నీరు పుల్లయ్య, పైన పిచ్చయ్య, పల్లపు గోపి, పోతురాజు మరికొందరిపై బల్లికురవ పోలీస్‌స్టేషన్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. గొడ్డళ్లతో తమనే చంపేందుకు తమ కాలనీలోకి వచ్చారని యనమల పద్మ, ముత్తయ్య, రాజేష్, లోకేష్‌లపై బల్లికురవ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఎస్సై పీ.అంకమ్మరావు కేసు నమోదు చేశారు. ఈ కేసు నమోదులపై దర్శి డీఎస్పీ ప్రకాశరావు అద్దంకి సీఐ అశోక్‌వర్ధన్‌ ఎస్సై అంకమ్మరావు బీసీ, ఎస్టీ కాలనీల్లో విచారణ చేపట్టారు.

మరిన్ని వార్తలు