కరోనా భయంతో వ్యక్తి ఆత్మహత్య

29 Mar, 2020 03:09 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

తుంగతుర్తి: కరోనా వైరస్‌ సోకిందేమోనన్న అనుమానంతో ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కర్విరాలలో శనివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కర్విరాల గ్రామానికి చెందిన వార్డుసభ్యుడు వెలుగు శ్రీనివాస్‌ (45) వారం క్రితం కరీంనగర్‌ నుంచి వచ్చిన ఓ వ్యక్తికి షేక్‌హ్యాండ్‌ ఇచ్చాడు. ఈ విషయాన్ని గమనించిన శ్రీనివాస్‌ కుటుంబ సభ్యులు.. కరోనా ముప్పు ఉండగా ఎందుకు కరచాలనం చేశావని అడిగారు. మరుసటి రోజు నుంచి శ్రీనివాస్‌ తనకు కరోనా సోకిందనే భయంతో వారికి దూరం, దూరంగా ఉంటున్నాడు. శనివారం తెల్లవారుజామున చూసేసరికి శ్రీనివాస్‌ ఇంట్లో లేకపోవడంతో  వ్యవసాయ బావి వద్దకు వెళ్లి ఉంటాడని భావించి భార్య, కుమారుడు అక్కడికి వెళ్లారు. అప్పటికే శ్రీనివాస్‌ అక్కడ మంటల్లో పూర్తిగా కాలిపోయి కనిపించాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు.  

కన్నీరుకూ కరోనా భయమే..!
మృతదేహం వద్ద దస్తీలు కట్టుకుని రోదిస్తున్న బంధువులు  
రామగిరి:
మాయదారి కరోనా.. చివరి మజిలీలోనూ ఇబ్బందులకు గురి చేస్తోంది. మృతదేహం వద్ద బంధువులు, కుటుంబ సభ్యులు నోటికి దస్తీలు కట్టుకుని రోదించాల్సిన పరిస్థితి. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం లద్నాపూర్‌ సర్పంచ్‌ బడికెల విజయ నాన్నమ్మ అక్కెమ్మ శనివారం మధ్యాహ్నం చనిపోయింది. బంధువులు నోటికి దస్తీలు, రుమాలు కట్టుకుని రోదించారు.  

మరిన్ని వార్తలు