రూ.2 కోట్ల విలువైన బంగారం పట్టివేత

19 Oct, 2017 02:48 IST|Sakshi

సాక్షి, బనశంకరి (బెంగళూరు): దుబాయ్‌ నుంచి పెద్ద ఎత్తున అక్రమంగా బంగారం తరలిస్తున్న ఇద్దరిని బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం కస్టమ్స్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ.2 కోట్ల విలువ చేసే బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. అబ్దూల్‌ రహమాన్‌ జారిజిక్‌ అనే వ్యక్తి మంగళవారం రాత్రి దుబాయ్‌ నుంచి బెంగళూరుకు చేరుకున్నాడు. అయితే అతడు అనుమానాస్పదంగా కనిపించడంతో కస్టమ్స్‌ అధికారులు తనిఖీ చేశారు. అతడి బ్యాగ్‌లో భారీగా బంగారు బిస్కెట్లు లభించాయి.

దీంతో కస్టమ్స్‌ అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. అబ్దూల్‌ రహమాన్‌ కోసం వేచిచూస్తున్న యూసుప్‌ పర్జుల్లా అనే వ్యక్తిని కూడా అరెస్ట్‌ చేశారు. వీరిద్దరూ గత కొన్నేళ్లుగా  అక్రమంగా బంగారం స్మగ్లింగ్‌ చేస్తున్నట్లు విచారణలో తెలిసింది. మరో కేసులో.. మలేసియా నుంచి ఎయిర్‌ఏషియా విమానంలో వచ్చిన మునిస్వామి అనే ప్రయాణికుడిని తనిఖీ చేయగా, ఒక బంగారు బిస్కెట్‌ లభించింది. దీంతో అతడిని కస్టమ్స్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు.

మరిన్ని వార్తలు