దోపిడీ కలకలం  

5 Jul, 2018 10:51 IST|Sakshi

ఉలిక్కిపడ్డ బీరంగూడ

సినీఫక్కీలో భారీ చోరీ

కిలో బంగారం,  రూ.4.5 లక్షలు ఎత్తుకెళ్లిన దొంగలు

కొనేవారిలా వచ్చి.. యజమానిపై దాడి చేసి, ఆపై బంధించి చోరీ

రంగంలోకి ఐదు పోలీసు బృందాలు

పటాన్‌చెరు టౌన్‌: అమీన్‌పూర్‌ మండలం బీరంగూడలోని జై భవానీ జువెల్లరీ షాపులో మంగళవారం రాత్రి సినీ ఫక్కీలో జరిగిన చోరీ కలకలం రేపింది. సమాచారం అందుకున్న ఎస్సీ చంద్రశేఖర్‌రెడ్డి, డీఎస్పీ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సీసీ కెమెరాలు పరిశీలించి, దొంగల దాడిలో గాయాలపాలైన షాపు యజమాని జైరాం ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. దుండగులు ఆరు నెలల క్రితం ఒక సారి షాపునకు వచ్చివెళ్లారని చెప్పడంతో పక్కా ప్లాన్‌ ప్రకారమే దొంగతనం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.

అసలు ఏం జరిగిందంటే..

మంగళవారం రాత్రి 9. 45 సమయంలో బురఖా వేసుకున్న ఓ మహిళ, ఓ వ్యక్తి బీరంగూడలోని జై భవానీ జువెల్లరీ షాపులోకి వచ్చి నగల మోడళ్లను చూపించాలంటూ యజమానిని కోరారు. సుమారు గంటసేపు అక్కడే గడిపారు. అనంతరం షాపు యాజమాని జైరాం లోపలికి వెళ్లి సేఫ్‌ లాకర్‌లో నగలు పెడుతుండగా పిస్టల్‌తో బెదిరిం చారు. అతను పిస్టల్‌ గుంజుకోవడానికి యత్నించడంతో బురఖా వేసుకున్న మహిళ అతని కళ్లలో కారం చల్లింది. వెంటనే ఇద్దరు కలసి వెంట తెచ్చుకున్న రాడ్‌తో జైరాం తలపై బలంగా కొట్టడంతో కుప్పకూలాడు. 

 అతడిని బాత్రూంలోబందించి షాపులో ఉన్న 1 కిలో బంగారు ఆభరణాలు, రూ. 4.5 లక్షల నగదు తీసుకొని పరారయ్యారు. కొద్దిసేపటి అనంతరం తేరుకున్న షాపు యజమాని బాత్రూం తలుపులు పగులగొట్టి బయటకు వచ్చి పోలీసులకు సమాచారం అందించాడు.

సమాచారం అందిస్తే రూ. లక్ష బహుమతి

చోరికి పాల్పడిన నిందితుడి ఫోటోను బుధవారం ఎస్పీ చంద్రశేఖర్‌ రెడ్డి విడుదల చేశారు. ఎవరైనా నిందితుడిని గుర్తించి సమాచారం అందిస్తే రూ. లక్ష బహుమతి అందిస్తామని ప్రకటించారు.

మరిన్ని వార్తలు