మోపెడ్‌ను ఢీకొన్న లారీ

4 Jan, 2019 06:59 IST|Sakshi
ఏడిబీ రోడ్డు ప్రమాదంలో మోపెడ్‌పై మృతి చెందిన బాలిక జ్యోతి

చాగల్లుకు చెందిన 11 ఏళ్ల బాలిక మృతి..

కుటుంబ సభ్యులు సురక్షితం

పెద్దాపురం ఏడీబీ రోడ్డులో ఘటన

తూర్పుగోదావరి, పెద్దాపురం: మోపెడ్‌పై వెళుతున్న కుటుంబ సభ్యులను లారీ ఢీకొనడంతో 11 ఏళ్ల బాలిక అక్కడికక్కడే మృతి చెందగా భార్య, భర్త, కుమారుడు, మనువడు సురక్షితంగా బయటపడ్డారు. గురువారం పెద్దాపురం ఏడీబీ రోడ్డులో జరిగిన ఈ సంఘటనపై స్థానిక పోలీసుల కథనమిలా.. పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లుకు చెందిన కుంజా సత్తిబాబు, భార్య చిన్న, మూడో కుమార్తె జ్యోతి, కుమారుడు ఉదయ్‌కుమార్, మనువడు ప్రదీప్‌లతో కలిసి టీవీఎస్‌ మోపెడ్‌పై వారు నివాసముంటున్న కాకినాడకు బయల్దేరారు.

పెద్దాపురం వాలుతిమ్మాపురం దాటే సరికి కాకినాడ వైపునకు వెళుతున్న గుర్తు తెలియని లారీ డ్రైవర్‌ వాహనాన్ని వెనుకకు తిప్పాడు. దీంతో మోపెడ్‌ అదుపు తప్పి కిందకు పడగా కుమార్తె జ్యోతి(11) అక్కడిక్కడే మృతి చెందింది. కుటుంబ సభ్యులు నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని బాలిక మృతదేహాన్ని పెద్దాపురం ప్రభుత్వాసుపత్రికి పోçస్టుమార్టం కోసం తరలించారు. సంఘటన స్థలం వద్ద తల్లి చిన్న, తండ్రి, తమ్ముడు రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. పెద్దాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు