వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని భార్య హత్య

10 Apr, 2019 12:27 IST|Sakshi
గౌతమి (ఫైల్‌), రాజేష్, కలైవాణి

భర్త, ప్రియురాలి అరెస్టు

అన్నానగర్‌: గురుపరపల్లి సమీపంలో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భార్యను హత్య చేసిన సైనిక వీరుడుని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. కృష్ణగిరి జిల్లా గురుపరపల్లి సమీపంలోని బి.దిప్పనపల్లికి చెందిన రాజేష్‌ (31). ఇతని భార్య గౌతమి (29). వీరికి గత 2012లో వివాహం జరిగింది. దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. రాజేష్‌ రాజస్థాన్‌ రాష్ట్రం జోద్‌పూర్‌లో సైనికుడిగా పని చేస్తున్నాడు. ఈ స్థితిలో గౌతమి గత 5వ తేదీన ఉదయం ఇంట్లో హత్యకు గురైంది.

ఆమె ముఖంపై దిండుతో అదిమిపట్టి ఊపిరి అందకుండా చేసి హత్య చేసినట్టు తెలిసింది. దీనిపై గురుపరపల్లి పోలీసు ఇన్‌స్పెక్టర్‌ ప్రభావతి కేసు నమోదు చేసి విచారణ చేశారు. విచారణలో.. గౌతమి భర్త రాజేష్‌కు, కర్ణాటక రాష్ట్రం దుమ్కుర్‌ సవారివం నగర్‌కి చెందిన కలైవాణి (30) అనే మహిళకు మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలిసింది. దీని గురించి తెలుసుకున్న గౌతమి భర్తను నిలదీసింది. ఈ స్థితిలో రాజేష్‌ సెలవులకి ఇంటికి వచ్చాడు. దీంతో గౌతమిని, రాజేష్‌ హత్య చేసి ఉండొచ్చనే కోణంలో పోలీసులు అతని కోసం గాలిస్తూ వచ్చారు. ఈ క్రమంలో రాజేష్‌ సోమవారం కృష్ణగిరిలో పోలీసులకు పట్టుబడ్డాడు. తన ప్రియురాలి ఒత్తిడి వల్లనే గౌతమిని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. రాజేష్, అతని ప్రియురాలు కలైవాణిని పోలీసులు అరెస్టు చేశారు.

>
మరిన్ని వార్తలు