ఆ రాత్రి ఏం జరిగింది?

2 Jul, 2018 09:20 IST|Sakshi

వివాహిత అనుమానాస్పద మృతి

ఆలస్యంగా వెలుగులోకి..

అత్యాచారం చేసి చంపేసినట్లు అనుమానం

‘‘ఆ రోజు రాత్రి కాలనీలో అందరూ గాఢనిద్రలో ఉన్నారు. ఓ ఇంటిలో నుంచి కొందరు వ్యక్తులు హడావుడిగా వెళ్లిపోయారు. కాసేపటికి ఓ చిన్నారి ఏడ్చుకుంటూ బయటకు వచ్చింది. డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళుతున్న ఓ పోలీసాయన పాపను చూసి ఆరా తీసి వారి ఇంటివైపు తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ తలుపులు తెరిచి ఉన్న ఇంట్లో ఉరికివేలాడుతూ వివాహిత కనిపించింది. అక్కడ మద్యం బాటిళ్లు కూడా కనిపించాయి. ఎవరో పూటుగా మద్యం తాగి.. ఆపై వివాహితపై అత్యాచారం జరిపి.. హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించినట్లుగా తెలుస్తోంది.’’

అనంతపురం సెంట్రల్‌: అనంతపురం నగరంలో ఓ వివాహిత అనుమానాస్పద మృతి కలకలం సృష్టిస్తోంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన వివరాలిలు విశ్వసనీయ సమాచారం మేరకు ఇలా ఉన్నాయి. కల్యాణదుర్గం బైపాస్‌ రోడ్డు సమీపాన కాలనీలో గురువారం అర్ధరాత్రి దాటాక నలుగురు యువకులు ఓ ఇంట్లోకి చొరబడ్డారు. ఆ సమయంలో కుటుంబ యజమాని లేడు. వివాహిత, ఆమె కుతూరు మాత్రమే ఉన్నారు. చాలాసేపటి తర్వాత ఆ వ్యక్తులు బయటకు వెళ్లిపోయారు. తలుపులు తెరిచి ఉండటంతో చిన్నారి ఏడ్చుకుంటూ చీకటిలో బయటకు వచ్చింది. భయం భయంగా అలా ముందుకు ఒంటరిగా సాగిపోతోంది. అదే సమయంలో ఇంటికి వెళుతున్న ఓ పోలీసు సిబ్బంది పాపను గమనించి దగ్గరకు తీసుకున్నాడు.

పాపను తీసుకుని వారి ఇంటివైపు వెళ్లాడు. అప్పటికే ఆ ఇంట్లో వివాహిత ఉరికి వేలాడుతూ కనిపించింది. ఇరుగుపొరుగు వారిని లేపి ఆ తర్వాత సంబంధిత పోలీసుస్టేషన్‌కు సమాచారం అందించాడు. రాత్రి బీట్‌లో ఉన్న ఇద్దరు ఎస్‌ఐలు ఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేశారు. ఆ ఇంట్లో మద్యం సీసాలు లభ్యమయ్యాయి. మరుసటి రోజు (శుక్రవారం) ఉదయం కుటుంబ సభ్యుల సమక్షంలో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

కుటుంబ సమస్యల వల్ల మనస్థాపంతో ఉరివేసుకొని వివాహిత చనిపోయినట్లు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే కాలనీ ప్రజలు మాత్రం ఆ రోజు ఏదో ఘోరం జరిగిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  
సాధరణంగా చిన్న సంఘటన జరిగినా పోలీసులు వివరాలను వెల్లడిస్తారు. కానీ సదరు మహిళ గత గురువారం అర్దరాత్రి మృతి చెందితే విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తగా విచారించారు. ఆమె చనిపోయిన తర్వాత కొంతమంది బయటకు వెళ్లిపోయినట్లు స్థానికుల ద్వారా తెలుస్తోంది. ఇంట్లో మద్యం బాటిళ్లు లభించడం బట్టి చూస్తే అక్కడ ఎవరో విందు చేసుకున్నట్లు అర్థమవుతోంది.  
భర్త ఇంట్లో లేని సమయంలో బయటకు వ్యక్తులు ఎందుకు వచ్చారు? మద్యం మత్తులో ఏమైనా జరిగిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబ సభ్యులు ఫిర్యాదు బలంగా ఇవ్వలేదనే కారణంతో పోలీసులు పెద్దగా పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి.

విచారణ చేస్తున్నాం
సదరు ఘటనపై కేసు నమోదు చేశాం. ఆత్మహత్య చేసుకున్నట్లు పోస్టుమార్టం నివేదికలో బయటపడింది. అయినప్పటికీ కొన్ని అనుమానాలున్నాయి. దీనిపై విచారణ చేస్తున్నాం.  
– ఆరోహణరావు, సీఐ, టూటౌన్‌

మరిన్ని వార్తలు