ఎర్రచందనం స్వాధీనం: ఐదుగురు స్మగ్లర్ల అరెస్టు

19 Oct, 2019 09:28 IST|Sakshi
స్వాధీనం చేసుకున్న ఎర్రదుంగలు, అరెస్టు చేసిన స్మగ్లర్లను చూపుతున్న అటవీ అధికారులు

సాక్షి, భాకరాపేట(చిత్తూరు) : ఎర్రచందనం స్వాధీనం చేసుకుని ఐదుగురు స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు భాకరాపేట ఫారెస్టు రేంజర్‌ కె.మోహన్‌కుమార్‌ తెలిపారు. భాకరాపేట ఫారెస్టు కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులకు తెలిపిన వివరాలు..తిరుపతి డీఎఫ్‌ఓ నాగార్జునరెడ్డి ఇచ్చిన రహస్య సమాచారం మేరకు తలకోన అటవీ ప్రాంతంలో గాలించారు.  ఎర్రావారిపాళెం మండలం తలకోన సెంట్రల్‌బీట్‌ బొబ్బిలిరాజు మిట్ట ప్రదేశంలోని శ్రీ వేంకటేశ్వర శాంక్షురీ నుంచి  ఎర్రచందనం తరలిస్తుండగా తెల్లవారుజామున 2 గంటలు సమయంలో స్మగ్లర్లను చుట్టుముట్టారు.ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రాబట్టిన సమాచారంతో ఒక ప్రదేశంలో దాచి ఉంచిన 753 కేజీల బరువుగల 20 దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

వీటి విలువ రూ4.56 లక్షలు.  ప్రాథమిక విచారణలో వీరంతా జిల్లా వాసులేనని, వీరిలో ధనంజేయులు(వెదురుకుప్పుం), షేక్‌.షాకీర్‌ (నంజంపేట, సోమల), ఊటుకూరు.శ్రీనాథ్, జి.శివశంకర్‌ (నెరబైలు, యానాదిపాళెం, యర్రావారిపాళెం), ఎం.రెడ్డిప్రసాద్‌(గొల్లపల్లె, దేవరకొండ, చిన్నగొట్టిగల్లు మండలం) ఉన్నట్లు చెప్పారు.  దాడుల్లో పాల్గొన్న ఎఫ్‌ఎస్‌ఓ జి.నాగరాజ, జి.వందనకుమార్, ఎం.వినోద్‌కుమార్, పి.చెంగల్‌రాయులు నాయుడు, ఎఫ్‌బీఓలు, బేస్‌ క్యాంప్‌ సిబ్బంది, ప్రొటెక్షన్‌ వాచర్లను ప్రత్యేకంగా అభినందించారు.

మరిన్ని వార్తలు