నమ్మించి వంచించాడు

12 Feb, 2019 13:25 IST|Sakshi

ఓ ప్రబుద్ధుడు తనను నమ్మించి వంచించాడంటూ పెదనందిపాడుకు చెందిన ఓ యువతి సోమవారం పోలీస్‌ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసింది. తనపై అనేక సార్లు లైంగిక దాడి చేసి.. ఎవరికైనా చెబితే తన కుటుంబాన్ని హతమార్చుతానని బెదిరించాడని వాపోయింది. ఇప్పుడు గర్భం దాల్చాక పెళ్లి చేసుకునేందుకు నిరాకరిస్తున్నాడని కన్నీరు పెట్టుకుంది. తనకు న్యాయం చేయాలని వేడుకుంది.

గుంటూరు: ‘ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయాల్లో లైంగిక దాడి చేశాడు. ఎవరికైనా చెబితే నాతోపాటు నా కుటుంబాన్ని హత మారుస్తానని బెదిరించాడు. గర్భిణిని చేశాక పెళ్లి చేసుకునేందుకు నిరాకరిస్తున్నాడు’ అంటూ ఓ యువతి సోమవారం గుంటూరులో జరిగిన పోలీస్‌ గ్రీవెన్స్‌లో క్రైమ్స్‌ ఏఎస్పీ ఎం వెంకటేశ్వర్లుకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి కథనం మేరకు.. పెదనందిపాడుకు చెందిన యువతి ఇంటర్‌ చదువుతూ మధ్యలోనే ఆపేసి ఇంటి వద్దే ఉంటోంది.

ఆమె ఇంటి సమీపంలోనే నివసించే దేవరకొండ గోపి.. ఆ యువతి ఒంటరిగా ఉండటాన్ని గుర్తించి లైంగిక దాడి చేశాడు. ఆపై జరిగిన విషయాన్ని ఎవరికైనా చెబితే స్టువర్టుపురంలోని తన బంధువుల ద్వారా యువతిని, ఆమె కుటుంబాన్ని హతమారుస్తానని హెచ్చరించాడు. ఏమీతోచని పరిస్థితుల్లో ఆ యువతి మౌనంగా ఉండిపోయింది. కొద్ది రోజులకు యువతిని మళ్లీ అతని ఇంటికి తీసుకువెళ్లి లైంగిక దాడి చేశాడు. అనంతరం తనను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. యువతి గర్భిణి అయ్యింది. ఈ విషయం ఇద్దరి ఇళ్లలో తెలిసింది. చీరాలకు చెందిన తమ బంధువుల అమ్మాయితో వివాహం చేసేందుకు గోపి తల్లిదండ్రలు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలిసిన బాధిత యువతి గోపిని నిలదీస్తే పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడు. అతనికి, అతని కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్‌ నిర్వహించి తమ ఇద్దరికీ వివాహం జరిపించాలని ఆ యువతి ఏఎస్పీని కోరింది. దర్యాప్తు చేసి న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు