శస్త్ర చికిత్సల గదిలో తగలబడిన ఏసీలు
దట్టమైన పొగతో బయటకు వచ్చిన రోగులు
ఒంగోలు సెంట్రల్: రిమ్స్ శస్త్రచికిత్సల గదిలో సోమవారం ఉదయం షార్ట్ సర్క్యూట్ అయింది. దీంతో మూడు ఏసీలు తగలబడి, శస్త్రచికిత్సలు నిలిచిపోయాయి. దట్టమైన పొగ అలుముకోవడంతో రోగులు భయంతో బయటకు పరుగులు తీశారు. దీంతో తాత్కాలికంగా ప్రధాన శస్త్రచికిత్స గదిని మూసేశారు. ఆర్దోపెడిక్ శస్త్రచికిత్స గదిలో కూడా పూర్తిగా పొగ అలుముకోవడంతో శస్త్రచికిత్సలను నిలిపేశారు. సిబ్బంది మంటలను ఆర్పివేశారు. సమాచారం అందుకున్న రిమ్స్ డైరక్టర్, ఇతర అధికారులు శస్త్రచికిత్సల గదుల వద్దకు చేరుకుని పరిశీలించారు. నాసిరకం వైరింగ్ గానీ, ఏసీలు గానీ వాడటం వలన అగ్నిప్రమాదం సంభవించి ఉండవచ్చని భావిస్తున్నారు.